Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్ అసెంబ్లీ ముట్టడికి యత్నం
పాట్నా : సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీహార్ కాంట్రాక్టు ఉపాధ్యాయులపై లాఠీచార్జీ జరిగింది. రెగ్యులర్ ఉద్యోగుల వలే తమకు కూడా వేతనాలు ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వాన్ని కొంతకాలంగా కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎంతకూ స్పందించకపోవడంతో గురువారం అసెంబ్లీ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టాలని కాంట్రాక్టు ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. బీహార్ రాజ్య శిక్షక్ సంఘర్ష్ సమన్వరు సమితి (బీఆర్ఎస్ఎస్ఎస్ఎస్) నాయకుడు అమిత్ విక్రమ్ ఆధ్వర్యంలో దాదాపు 18 ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, వీరు అసెంబ్లీకి చేరుకోకముందే అక్కడ భారీగా మొహరించిన పోలీసులు ఉద్యోగులపై లాఠీచార్జీ చేశారు. దొరికొనోళ్లను దొరికనట్టుగా చితకబాది, అనంతరం టీయర్గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయయని అమిత్ విక్రమ్ తెలిపారు. ప్రశాంతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు అక్రమంగా లాఠీచార్జీ చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి నితిశ్కుమార్కు, విద్యాశాఖ మంత్రి కె ఎన్ వర్మకు తమ గోడు వినే సమయం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కాంట్రాక్టు ఉద్యోగులపై లాఠీచార్జీని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఉద్యోగుల సమస్యల మీద తనకు సమాచారం లేదన్న మంత్రి వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.