Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకులను మెర్జర్ చేయడం ద్వారాపెద్ద ఎత్తున సానుకూల ఫలితాలు వుంటాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని సంవత్సరాలుగా విలీన ప్రక్రియ జోరందుకుంది. అయితే, ఈ విలీనాల ఫలితాలేమిటి? అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ విలీనాల ప్రక్రియపై నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంకింగ్రంగ సంస్కరణలలో భాగంగా ప్రభుత్వం 1991 తరువాత అనేక కమిటీలను నియమించింది. నరసింహ కమిటీ, లీలాభర్ కమిటీ, నాయక్ కమిటీ, రంగరాజన్ కమిటీ లాంటి అనేక కమిటీలు బ్యాంకింగ్రంగ ప్రయివేటీకరణే ధ్యేయంగా అనేక సిఫార్సులు చేశాయి. వీటిలో బ్యాంక్ మెర్జర్స్ (విలీనాలు) ప్రధానమైనవి. దేశంలో ఉన్న 28 ప్రభుత్వరంగ బ్యాంకులను కలిపి 6 లేక 7 పెద్ద బ్యాంకులుగా చేయాలని నరసింహం కమిటీ 1993లోనే సిఫారసు చేసింది. పెద్ద బ్యాంకులుగా చేసి, మూలధన వాటాలను అమ్మటం ద్వారా ప్రభుత్వ వాటాను తగ్గించుకొని ప్రయివేటీకరణ చేయటమే దాని సారాంశం. బ్యాంకు ఉద్యోగులు, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల పోరాటాల ఫలితంగా 20 ఏండ్లకు పైగా ప్రభుత్వం ముందుకెళ్లలేదు. కానీ కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనేక వాదనలను ముందుకు తెచ్చి ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలను చేపడుతోంది.
కేంద్ర ప్రభుత్వం అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేసింది. ఈ మధ్యకాలంలో దేనా బ్యాంకు, విజయాబ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలిపింది. మిగిలిన బ్యాంకులను కూడా విలీనం చేస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. దీనికి ప్రభుత్వం ముందుకు తెస్తున్నవన్నీ పసలేని వాదనలే. ప్రపంచ స్థాయి పోటీ కోసం ప్రపంచస్థాయి పెద్ద బ్యాంకులు వుండాలని, పెద్ద బ్యాంకులు నిర్వహణ ఖర్చులను తగ్గించుకొని లాభదాయకంగా అవుతాయని ప్రభుత్వ వాదన. కానీ అనుభవం దీనికి విరుద్ధంగా, సమాజానికి అర్థిక వ్యవస్థకు నష్టదాయకంగా వుంది. ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టేది మరో దారని సామెత. అలాగే ప్రపంచమంతా చిన్న బ్యాంకుల మార్గమే మంచిదని చెపుతుంటే మన దేశం విలీనాల వైపు అడుగులేస్తున్నది.
పెద్దబ్యాంకులతో అసలుకే ముప్పు: ప్రపంచబ్యాంకు
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభకాలంలో అమెరికా, యూరప్లోని అనేక దేశాలలో అతిపెద్ద బ్యాంకులు కుప్పకూలి ఆర్థిక వ్యవస్థ మందగించిన విషయం తెలిసిందే. ఆ అనుభవం తరువాత చిన్న బ్యాంకులే ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరమని ప్రపంచబ్యాంకు కూడా ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. ఎంత పెద్ద బ్యాంక్ కుప్పకూలితే ఆర్ధిక వ్యవస్థకు అంత ఎక్కువ నష్టం. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు అందాలంటే ఇంకా అనేక చిన్నచిన్న బ్యాంకుల కావాలని, విలీనాలతో కుదింపు కాదని అభిప్రాయపడ్డారు. విలీనాల మీద 2013లో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక కూడా విలీనాలను వ్యతిరేకించింది. విలీనాల వలన అదనపుశాఖల మూసివేత పేరుతో శాఖలు మూతపడ్డాయని, దానివలన ఉద్యోగాల కుదింపు జరుగుతోందని, పెద్ద బ్యాంకులు పెద్ద పెద్ద కార్పొరేట్లకు రుణాలివ్వటానికే మొగ్గు చూపుతాయని, ఫలితంగా సామాన్య ప్రజానీకానికి రుణాలు తగ్గిపోతాయని, బ్యాంకింగ్ సేవలకు సామాన్య ప్రజానీకం దూరమవుతారని, తక్కువ సంఖ్యలో బ్యాంకులుండటం వలన వీటి మధ్య పోటీ తగ్గి బ్యాంకింగ్ సేవల మీద చార్జీలు (రుసుము) పెరుగుతాయని రిజర్వ్ బ్యాంక్ నివేదిక చెప్పింది. అమెరికాలో కూడా బ్యాంక్ మెర్జర్స్ మీద జరిగిన పరిశీలనలో మెర్జర్ల ద్వారా అతిపెద్ద బ్యాంకులుగా రూపొందినవి. రుణాల మంజూరులో జాతి వివక్ష ప్రదర్శించినట్టుగా రుజువైంది.
స్టేట్ బ్యాంక్ విలీనం కూడా అనర్థాలకే..
భారతీయ మహిళా బ్యాంకు, అసోసియేట్ బ్యాంకులు స్టేట్ బ్యాంక్లో విలీనమైన తరువాత ఆ విలీనం విజయవంతమైనట్టు ప్రభుత్వం ప్రకటించుకుంది. కానీ వాస్తవం ఏమిటి? స్టేట్ బ్యాంక్ చరిత్రలో మొట్టమొదటిసారి నష్టాలను మూటకట్టుకుంది. విలీనమైన బ్యాంకుల మొండి బాకీలన్నీ కలిసి స్టేట్ బ్యాంకును కృంగతీశాయి. హేతుబద్దీకరణ పేరుతో దగ్గరదగ్గరగా ఉన్న సుమారు 7వేల శాఖలను మూసివేశారు. దానికి తగినట్టుగా 15,000కు పైగా ఉద్యోగాల సంఖ్యను కుదించారు. గత ఏడేండ్లలో ఎక్కువ ఉద్యోగాలను కల్పించింది బ్యాంకింగ్ రంగం. ఆ రంగంలో కీలకమైన స్టేట్ బ్యాంక్ ఇప్పుడు ఉద్యోగ నియామకాలను నిలిపివేసింది. విలీనం తరువాత ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంకులో భారతీయ స్టేట్ బ్యాంక్ చేరిందని ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ స్థాయి బ్యాంకుకి ప్రపంచ స్థాయి వ్యాపారమే ముఖ్యం. అందుకే విలీనం తరువాత సేవింగ్స్ తదితర ఖాతాలలో కనీస నిల్వల పరిమిత విపరీతంగా పెంచింది. కనీస బ్యాలెన్స్ లేని ఖాతాల నుండి అపరాధ రుసుం వసూలు ద్వారా రూ. 2000 కోట్లు ఖాతాదారుల మీద భారం మోపింది. లక్షల చిన్న చిన్న ఖాతాలు ఇతర బ్యాంకులకు తరలిపోయాయి.
- స్టేట్ బ్యాంకులో విలీనమైతే ఆ బ్యాంకులో ఉన్న అదనపు జీతభత్యాలు తమకు కూడా వర్తిస్తాయని ఉద్యోగులు భావించారు. కానీ విలీనమైన బ్యాంకులో కాని, విలీనం చేసుకున్న స్టేట్ బ్యాంక్లో కానీ ఎక్కడ తక్కువ సదుపాయాలుంటే వాటినే ఉద్యోగులకు వర్తింపజేసింది. చేసేది లేక ఉద్యోగులు న్యాయం కోసం హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు
ఇదీ రహస్యం
పెద్ద పెద్ద కార్పొరేట్ల రూ. లక్షల కోట్ల రుణ అవసరాలను తీర్చాలి. బాకీలు కట్టకపోతే రద్దు చేసుకొనే శక్తి పెంచుకొని కార్పొరేట్లను కాపాడాలి దీనికోసం సామాన్య ప్రజలు దాచుకున్న సంపదనే వాడుకోవాలి. అది జరగాలంలే విలీనాల పేరుతో పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలి. ఆ తరువాత వాటిని ప్రయివేటీకరించాలి. కార్పొరేట్ శక్తులకే పూర్తి పెత్తనాన్ని అప్పగించాలి.
ఏం చేయాలి..?
సామాన్య ప్రజానీకం, రైతాంగం, చిన్న పరిశ్రమల అవసరాలను తీర్చటానికి మరిన్ని చిన్న చిన్న బ్యాంకులు విస్తరించటం అవసరం. బ్యాంకు విలీనాలు, దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తాయి. సామాన్య ప్రజల డిపాజట్ల సొమ్ము వారి సంక్షేమానికి, దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడాలంటే ప్రయివేటీకరణకు దారితీసే విలీనాలను అడ్డుకోవడం ఒక్కటే మార్గం.
- విరించి.