Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిషాలో హృదయవిదారక ఘటన
భువనేశ్వర్: ఆ రాష్ట్రంలో శవాలను ఆస్పత్రి నుంచి ఉచితంగా తరలించే 'మహాప్రయాణ వాహన పథకం' అందుబాటులో ఉంది. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాంతో చేసేదేమీ లేక ఓ గిరిజన వ్యక్తి తన తండ్రి శవాన్ని భుజాలపైనే ఐదు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి అంత్యక్రియలు జరిపించాడు. ఈ హృదయ విదారక ఘటన ఒడిషాలోని కలహండి జిల్లా తువాముల్ రాంపూర్ బ్లాక్ మెల్ఘర్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిజన తెగకు చెందిన పులు మాఝి తండ్రి జ్వరంతో బాధపడుతూ కనిగుమ ఆస్పత్రిలో సోమవారం మృతి చెందాడు. మాఝి వద్ద డబ్బులు లేకపోవడంతో శవాన్ని తరలించేందుకు వాహన సదుపాయాన్ని కల్పించాలని ఆస్పత్రి యజమాన్యాన్ని వేడుకున్నాడు. ఆస్పత్రి వారు పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఆరోగ్య శాఖ అధికారులనూ సంప్రదించాడు. వారు కూడా కనికరించలేదు. దాంతో చేసేదేమీ లేక జోలా లాంటిది తయారు చేసుకుని బంధువు సహాయంతో తన తండ్రి శవాన్ని ఐదు కిలోమీటర్ల పాటు భుజాలపైనే మోసుకెళ్లి అంత్యక్రియలు జరిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా వైద్యాధికారి బనాలత దేవీ స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఇదే రాష్ట్రంలో 2016 ఆగస్టులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ గిరిజన రైతు భార్య శవాన్ని వాహనంలో తరలించడానికి ఆస్పత్రి యాజమాన్య తిరస్కరించడంతో ఆమె మృతదేహాన్ని 10కిలోమీటర్లపాటు భుజాలపైనే మోసుకెళ్లిన విషయం తెలిసిందే.