Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీ కోచ్లో ప్రయాణానికి పేదలు దూరం
- రెండు రూట్లలో ఇప్పటికే తొలగింపు
న్యూఢిల్లీ : పేదలు సైతం ఏసీలో ప్రయాణించే లక్ష్యంతో 2006లో ప్రవేశపెట్టిన గరీబ్ రథ్ ట్రెయిన్లను మోడీ సర్కారు నిలిపేసేందుకు కసరత్తులు చేస్తున్నది. దీంతో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఏసీ ప్రయాణానికి దూరం కానున్నారు. అంతేకాదు, గరీబ్ రథ్ బోగీల తయారీని నిలిపేయాలనీ కేంద్రం ఆదేశించింది. కాగా, రెండు మార్గాల్లో( ఉత్తరాఖండ్లోని కాథ్గోదం-జమ్మూ, కాథ్గోదం-కాన్పూర్) గరీబ్ రథ్ ట్రెయిన్లకు బదులుగా మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ ట్రెయిన్లను ఇప్పటికే ప్రారంభించింది. అంటే అక్కడి ప్రయాణికులు ఎక్కువ చార్జీలను చెల్లించాల్సిందే. దీంతో సంపన్నులు, పారిశ్రామికవేత్తలకు ఉపయుక్తంగా ఉండే బుల్లెట్ ట్రెయిన్పైనే మోడీ సూటుబూటు సర్కారుకు దృష్టి ఎక్కువన్న విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 26 గరీబ్ రథ్లు నడుస్తున్నాయి. 12 బోగీలున్న గరీబ్ రథ్ ట్రెయిన్లో అన్ని ఏసీ 3 టయర్ కోచ్లుంటాయి. ఎక్స్ప్రెస్ ట్రెయిన్లలోని ఏసీ 3 టయర్ కోచ్ల ధరలతో పోలిస్తే 40శాతం తక్కువ చార్జీలుంటాయి. ఉదాహ రణకు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ నుంచి పాట్నా జంక్షన్కు గరీబ్ రథ్ చార్జీ రూ. 900. కాగా, ఎక్స్ప్రెస్లోని ఏసీ 3 టయర్ ప్రయాణానికి టికెట్ ఖరీదు రూ. 1300. అంటే రూ. 400 అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, పేదలకు ఏసీ ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తెచ్చిన ఈ గరీబ్ రథ్లను నిలిపేసేందుకు మోడీ సర్కారు తెరలేపింది. అందులో భాగంగానే కొత్తగా గరీబ్ రథ్ కోచ్లను తయారీని నిలిపేయాలని ఆదేశించింది. ప్రస్తుతమున్న 12 బోగీల గరీబ్ రథ్లను 16 బోగీల ఎక్స్ప్రెస్లుగా మార్చే యోచన చేస్తున్నది. మొత్తంగా గరీబ్ రథ్లను పూర్తిగా తొలగించేందుకు సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా పేదలు, దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి ప్రజలు చౌక ధరలున్న ట్రెయిన్లలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారు. కానీ, సర్కారు ఖజానా కోసం రైల్వే ప్రొడక్షన్ యూనిట్లను ప్రయివేటీకరణ చేసేందుకు మోడీ సర్కారు ఎత్తులు వేస్తున్నది. కాగా, ప్రధానంగా పారిశ్రామికవేత్తలు, సంపన్నులకు ఉపయోగపడే బుల్లెట్ ట్రెయిన్ల నిర్మాణానికి మాత్రం మోడీ సర్కారు పెద్దపీట వేస్తున్నది. దీంతో పేదల పొట్ట కొట్టి ధనికులకు పెట్టే పద్ధతిని మోడీ సర్కారు అవలంబిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి.