Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుమారస్వామికి గవర్నర్ డెడ్లైన్ సభ నేటికి వాయిదా
- కర్నాటక అసెంబ్లీలో గందరగోళం
- కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం
- విశ్వాసపరీక్షను వాయిదావేయాలి : కాంగ్రెస్
- జరపాల్సిందే : సభలోనే బీజేపీ సభ్యుల బైటాయింపు
బెంగళూరు : కర్నాటక అసెంబ్లీలో గురువారం ఆసక్తికర పరిణామాలతోపాటు, ఇరుపక్షాల వాగ్వివాదంతో ఉద్రిక్తత నెలకొన్నది. మరోవైపు స్పీకర్పై ఒత్తిడి పెంచి మరీ బలపరీక్ష నిర్వహించటానికి బీజేపీ గవర్నర్ను కలిసింది. ఆయన జోక్యం చేసుకుంటూ స్పీకర్కు మెసేజ్ పంపటం కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. మొత్తం మీద పలు నాటకీయ పరిణామాల మధ్య స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇంకోవైపు బలపరీక్ష జరపాల్సిందేనంటూ బీజేపీ పట్టుపట్టింది. రాత్రంతా పార్టీ ఎమ్మెల్యేలతోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బిఎస్ యడూరప్ప అసెంబ్లీలోనే గడిపారు. సభలోనే నిద్రించారు.
ఎపిసోడ్..1లో ఏం జరిగింది..?
గురువారం ఉదయం సభ ప్రారంభంకాగానే... స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. తమ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ను కిడ్నాప్ చేశారని వారు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు బలపరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటికే బీజేపీ సభ్యులు బలపరీక్షను ఈ రోజే నిర్వహించాలంటూ గవర్నర్ను కలిసి లేఖ అందచేశారు. గవర్నర్ పంపిన సందేశాన్ని స్పీకర్ రమేష్ కుమార్ సభలో చదివి వినిపించారు.
స్పీకర్ను గవర్నర్ ఎలా ఆదేశిస్తారు? : కాంగ్రెస్
స్పీకర్ను గవర్నర్ ఎలా ఆదేశిస్తారని కాంగ్రెస్ సభ్యులు మండిపడుతున్నారు. 'రాజ్యాంగం ప్రకారం సభ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోజాలరు. సభా కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దని గవర్నర్కు విజ్ఞప్తి చేస్తున్నాను' అని కాంగ్రెస్ సభ్యుడు హెచ్కె పాటిల్ అన్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య మరో సారి మాటల యుద్ధం నెలకొంది. బలపరీక్షపై స్పీకర్ రమేశ్ కుమార్ కావాలనే జాప్యం చేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు కాంగ్రెస్ సభ్యులు ..మరోవైపు బీజేపీ సభ్యులు అసెంబ్లీలోనే ఆందోళనకు దిగారు.
ఆయన ఎలా వున్నారో ..: శ్రీమంత్ పాటిల్ వ్యవహారంపై స్పీకర్
తమ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ కిడ్నాప్కు గురయ్యారంటూ కాంగ్రెస్ సభ్యుల వాదనపై స్పీకర్ రమేశ్ కుమార్ సీరియస్ అయ్యారు. కిడ్నాప్ అయిన విషయం వాస్తవమా? కాదా? ఆయన కుటుంబసభ్యులను వెంటనే సంప్రదించండి. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు లాంటి వివరాలతో కూడా నివేదికను శుక్రవారం నాటికి నాకు అందచేయాలని హౌంమంత్రిని ఆదేశించారు. ఆయన రక్షణ విషయంలో హౌం శాఖ హామీ ఇవ్వకపోతే.. డీజీపీతో స్వయంగా మాట్లాడతానని స్పీకర్ అన్నారు.
విప్ విషయంలో క్లారిటే వచ్చాకే... : సిద్ధరామయ్య
ముఖ్యమంత్రి కుమారస్వామి రెబెల్ ఎమ్మెల్యేలు నారాయణ గౌడ్, గోపాలయ్య, హెచ్ విశ్వనాథన్ సహా తన పార్టీకి చెందిన 37 మందికి బుధవారం విప్ జారీచేశారు. విశ్వాస పరీక్ష సమయంలో అందరూ సభకు హాజరుకావాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా, లేదా పార్టీ విప్కు భిన్నంగా ఓటువేస్తే.. ఫిరాయింపుల నిరోధ చట్టం కింద ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడుతుందని కూడా ఆయన హెచ్చరికలు జారీచేశారు. కాగా, విప్ విషయంలో స్పష్టత లేనందున విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కోర్టు నుంచి స్పష్టతవచ్చిన తర్వాతే, విశ్వాస పరీక్ష నిర్వహించాలని స్పీకర్కు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఓటింగ్ నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ నేత యడ్యూరప్ప ఆరోపించారు. గురువారమే ఓటింగ్ జరపాలని పట్టుపట్టారు.
సభలోనే డిప్యూటీ సీఎం ఆఫర్
కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్ ఏకంగా సభలోనే బీజేపీ నేతకు బహిరంగ ఆఫర్ ఇచ్చారు. తమతో జత కలిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని శ్రీరాములును కోరారు. ఇద్దరి మధ్య సభలో జరిగిన చర్చ హాట్ టాపిక్ అయ్యింది.
కోలుకున్న వెంటనే బెంగళూరుకు : కాంగ్రెస్ ఎమ్మెల్యే పాటిల్
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిచారు. 'వ్యక్తిగత పనుల మీద చెన్నైకు వెళ్ళాను. అక్కడ ఛాతి నొప్పిగా అనిపించింది. ఆస్పత్రికి వెళ్ళాను. డాక్టర్ సలహామేరకు ముంబయికి వచ్చి ఇక్కడి ఆస్పత్రిలో చేరాను. కోలుకున్న తర్వాత ముంబయి నుంచి బెంగళూరుకు తిరిగివెళ్తాను' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే పాటిల్ ట్వీట్ చేశారు. కాగా, చెన్నై విమానాశ్రయంలో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సవడితో శ్రీమంత్ పాటిల్ కలిసి వున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం కొనసమెరుపు.
గవర్నర్ డెడ్ లైన్
కర్నాటక సంకీర్ణ సర్కార్ విశ్వాస పరీక్ష ఒకరోజు వాయిదా పడగా.. సీఎం కుమారస్వామికి గవర్నర్ డెడ్లైన్ విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30గంటల లోపు బలపరీక్ష జరపా లని స్పీకర్కు ఆదేశాలు జారీచేశారు. కాగా, సభలో శుక్రవా రం ఏం జరుగుతుందన్న దానిపై కర్నాటక మొదలు కుని దేశ రాజకీయాల్లో చర్చ నడుస్తున్నది. సంకీర్ణ సర్కారు నిలబడుతుందా..? లేక బీజేపీ ఎత్తులతో కుమార సర్కార్ కూలుతుందా..? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.