Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రసవత్తరంగా కర్నాటకీయం
- రాజీనామాలు ఉపసంహరించం : రెబెల్ ఎమ్మెల్యేలు
- అటు సుప్రీం కోర్టు..ఇటు అసెంబ్లీవైపే అందరి చూపు
బెంగళూరు : రోజురోజుకూ 'మెగా సీరియల్'ను తలపిస్తున్న కర్నాటక రాజకీయ రణరంగం తేలు తుందా? లేక ఏం జరుగుతుందన్న సస్పెన్స్కు తెరపడటంలేదు. గవర్నర్ ఆదేశాలను పట్టించుకోకుండా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్.. సభను సోమవారానికి వాయిదా వేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం కర్నాటక అసెంబ్లీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి..? అటు సుప్రీం కోర్టులో సీఎం కుమారస్వామి వేసిన పిటిషన్పై తీర్పు ఎలా రాబోతుంది..? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాంగ్రెస్-జేడీ(ఎస్)ల సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సభలో ఓవైపు బీజేపీ ఆందోళన చేస్తుండగా.. 'కొంపలేమీ మునిగిపోవు' అని స్పీకర్ చెబుతున్న విషయం విదితమే. కాగా, శుక్రవారం సభను నిరవధికంగా రెండు రోజుల పాటు వాయిదా వేయగా.. కుమార సర్కారుకు సోమవారం ఆఖరి రోజు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. 'రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలను బలపరీక్షకు రావాలని బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ విషయంలో వారికి స్వేచ్ఛ ఉంది. కాంగ్రెస్-జేడీ(ఎస్)లు జారీ చేసిన విప్లకు విలువ లేదు. సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, స్పీకర్లు రేపటి అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలి. సంకీర్ణ ప్రభుత్వానికి రేపే ఆఖరిరోజు' అని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటేసంకీర్ణ ప్రభుత్వానికి ఆదివారం మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే మహేశ్ తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సూచన మేరకు నేడు జరిగే బలపరీక్షలో పాల్గొనాలని ఎమ్మెల్యేను ఆదేశించారు. ఇక ఈ ఎపిసోడ్ మొత్తానికి కారణమైన రెబెల్ ఎమ్మెల్యేలు సైతం పట్టు వీడటం లేదు. సోమవారం జరగబోయే విశ్వాస పరీక్షకు తాము వెళ్లబోమని తేల్చిచెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలో చేరి తప్పుచేశామనీ, దీనికి గానూ తమను క్షమించాలని వారు ప్రజలను కోరారు.
అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో నేడు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) నేతలు ఆదివారం యశ్వంత్పూర్లోని ఓ హౌటల్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి సిద్ధరామయ్య, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండురావుతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ వేణుగోపాల్ హాజరయ్యారు. అంతకుముందు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు హెచ్.కె.పాటిల్ ప్రస్తుత పరిస్థితిపై స్పందిస్తూ.. సోమవారం జరిగే విశ్వాస పరీక్షలతో తాము నెగ్గితీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం కుమారస్వామి ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్ష నిర్వహిస్తారా..లేక స్పీకర్ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తారా..అన్నదానిపై పెద్ద చర్చ.