Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తర్వాతి స్థానంలో ఢిల్లీ
- గతేడాదితో పోల్చితే పెరిగిన కేసులు
ముంబయి : దేశ వాణిజ్య, రాజకీయ రంగాల్లో అతి కీలకమైన రెండు నగరాలు ఏటీఎం మోసాల్లోనూ ముందున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయి, దేశ రాజధాని ఢిల్లీలలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదే అంశంపై బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఇటీవల ఓ నివేదికను సమర్పించాయి. దాని ప్రకారం.. ఏటీఎం మోసాలకు సంబంధించి ఈ ఏడాదిలో మహారాష్ట్రలో 233 కేసులు నమోదవ్వగా.. ఢిల్లీలో 179 కేసులు నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో తమిళనాడు (147), కర్నాటక (65)లు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఇలాంటివి 980 ఫిర్యాదులు అందాయి. గతేడాది ఇవి 911గా ఉన్నాయి. కాగా, ఈ ఏడాది ఇటువంటి మోసాల్లో ఏటీఎంలు, సాధారణ ప్రజల నుంచి మోసగాళ్లు కొట్టేసిన నగదు విలువ రూ. 21.4 కోట్లు. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో రూ. 4.81 కోట్లు, తమిళనాడులో రూ. 3.63 కోట్లు, ఢిల్లీలో రూ. 2.9 కోట్ల రూపాయలు దొంగల పాలయ్యాయి. ఇదిలాఉంటే ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్ప్రదేశ్, త్రిపురలలో ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడం గమనార్హం.
దీనిపై సైబర్ క్రైం పోలీసులు, నిపుణులు మాట్లాడుతూ.. లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఏటీఎంలనే మోసగాళ్లు కొళ్లగొడుతున్నారు. డేటాకార్డుల రూపంలో ఉండే 'స్కిమ్మర్ డివైజ్'ల సాయంతో వీరు ఏటీఎంలను లూటీ చేస్తున్నారు. 'బ్లాంక్'గా ఉండే ఈ స్కిమ్మర్ డివైజ్లలో అంతకుముందే కొంత సమాచారాన్ని నిక్షిప్తం చేసి వాటిని ఏటీఎంలలో పెడతారనీ, తద్వారా అందులోని డబ్బును స్వాహా చేస్తారు. ఢిల్లీలో దీనికోసం కొన్ని గ్యాంగులు పనిచేస్తున్నాయి.
ఏటీఎంల లూటీయే గాక ఆ కేంద్రాల వద్దకు వచ్చిన నిరక్షరాస్యుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అక్కడ వారిని ఏమార్చి కార్డులను మార్చడం వీరి పని. తదనంతరం బాధితుల బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్ని డ్రా చేస్తున్నారు. ఇక కొత్తగా పుట్టుకొచ్చిన ఆన్లైన్ మోసాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ ఫోన్ చేసి బాధితుల ఏటీఎం కార్డుపై ఉండే సీవీవీ, పిన్ వివరాలు తెలుసుకుని తద్వారా వారి ఖాతాల్లో ఉన్న నగదును దొంగిలిస్తున్నారని సైబర్ నిపుణులు తెలిపారు.