Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంతర్మంతర్లో భూమి అధికార్ ఆందోళన్ ధర్నా
- ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా సంఘీభావం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
వేలాది సంవత్సరాలుగా అడవుల్లోనే నివసిస్తున్న ఆదివాసీల హక్కులకు అండగా ఉండేటువంటి అటవీ హక్కుల చట్టాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని అఖిల భారత కిసాన్ సభ హన్నన్ మొల్లా డిమాండ్ చేశారు. అడవి నుంచి ఆదివాసీలను సాగనంపేందుకు మోడీ సర్కారు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశం పేరిట అడవి బిడ్డలపై ఉక్కుపాదం మోపతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత సర్వోన్నత న్యాయస్థానంలో ఆదివాసీలను రక్షించేందుకు దాఖలు పరిచిన పిటిషన్పై చిత్తశుద్ధితో పోరాడాలని డిమాండ్ చేశారు. సోమవారం భూమి అధికార్ ఆందోళన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద భారీ ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా గిరిజనుల సమస్యలపై ప్రసంగించారు. ఆదివాసీల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ సమయంలో ప్రభుత్వం నుంచి ఎవ్వరూ హాజరు కాకపోవడం ఏంటని నిలదీశారు. పోరాడి సాధించుకున్న చట్టంపై ప్రభుత్వం ఉద్దేశ పూరితంగా నిర్లక్ష్యం వహించడం సముచితం కాదన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో భూమి అధికార్ ఆందోళన్ నాయకులు విక్రమ్ సింగ్, జుహేబ్, నత్తూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.