Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌరుల సమాచార హక్కుకు పొంచి ఉన్న ప్రమాదం
- ఆర్టీఐ చట్టాన్ని చావుదెబ్బతీసే యత్నం
- అడ్డుకోవాల్సిందిగా ఎంపీలకు కేంద్ర సమాచార మాజీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యుల లేఖ
న్యూఢిల్లీ: సమాచార హక్కు సవరణ బిల్లు-2019 వల్ల పౌరుల సమాచార హక్కుకు తీవ్ర విఘాతం కలుగుతుందని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ఆచార్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ అమలైన సమాచార హక్కు చట్టానికి ఈ బిల్లులో ప్రతిపాదించిన సవరణలు చావు దెబ్బలాంటివని ఆయన అన్నారు. ఆర్టీఐ చట్టం-2005లో కేంద్ర ఎన్నికల కమిషనర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉండే స్వతంత్రత సమాచార కమిషనర్లకు ఉన్నదని, సవరణలు చట్ట రూపం దాల్చితే ఇకముందు ఉండదని ఆయన వివరించారు. దీనిపై పార్లమెంట్ ఉభయ సభల సభ్యులకు శ్రీధర్ లేఖ రాశారు. సవరణ బిల్లును అడ్డుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు.
ఇప్పటివరకూ అమలైన ఆర్టీఐ చట్టం-2005 ప్రకారం సమాచార కమిషనర్లు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులుసహా ఏ అధికారికైనా సమాచారం తెలపమని ఆదేశించే హక్కును కలిగి ఉన్నారని శ్రీధర్ తెలిపారు. సవరణ బిల్లు ఆమోదం పొందితే..సమాచార కమిషనర్ల హౌదా, పదవీకాలం, వేతనాలు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులపై ఆధారపడి ఉంటాయని, అందువల్ల పౌరుల సమాచార హక్కుకు భంగం కలుగుతుందని శ్రీధర్ ఆచార్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఉన్న చట్టంలోనూ ప్రభుత్వాధినేతలు తమకు అనుకూలమైనవారిని నియమించుకునే అవకాశముండటంతో కమిష నర్లుగా ఎంపికైన కొందరు స్వతంత్రంగా వ్యవహ రించలేపోతున్నారని ఆయన విమర్శించారు.
2005 చట్టం ప్రకారం సమాచార కమిషనర్ల పదవీకాలం ఐదేండ్లు లేదా 65 ఏండ్లు నిండే వరకూ, ఏది ముందైతే అంతవరకూ ఉన్నది. ఆ నిర్ణీత గడువులోగా వారిని తొలగించే అధికారం ఎవరికీ లేదు. సవరణ బిల్లులో ఆ హక్కును తొలగించే ప్రతిపాదన ఉన్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోనివారు విడుదల చేసిన ప్రకటనల్లో ఆ సూచనలున్నాయి. కేంద్ర కమిషనర్లు, రాష్ట్రాల కమిషనర్ల పదవీకాలం, హౌదా, వేతనంపై కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయాధికారం ఉండనున్నట్టు చెబుతున్నారు. చట్టం ప్రకారం నియమితులయ్యే కేంద్ర సమాచార కమిషనర్లను రాజ్యాంగం ప్రకారం ఏర్పాటయ్యే ఎన్నికల కమిషనర్లతో పోల్చలేమంటూ కేంద్రమంత్రులు చేసిన ప్రకటనల సారాంశం స్వతంత్రను తీసేసే సూచికగా భావిస్తున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టుకూ, కేవలం చట్టబద్ధమైన సమాచార కమిషన్కూ హౌదాలో తేడా ఉండాల్సిందే అంటున్న కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు ఆర్టీఐ చట్టం కోరలు తీసే ప్రయత్నమేనని అర్థమవుతోంది. హౌదా, వేతనాలు, పదవీకాలంపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన వివరణ రాలేదు.
సవరణ బిల్లు-2019ని రెండు తప్పుడు ప్రతిపాదనల ఆధారంగా రూపొందించినట్టు శ్రీధర్ ఆచార్యులు విమర్శించారు. అందులో ఒకటి: ఆర్టీఐ చట్టం రాజ్యాంగపరమైనది కాదని. రెండోది: గత(యూపీఏ) ప్రభుత్వం ముఖ్య సమాచార కమిషనర్నూ, ప్రధాన ఎన్నికల కమిషనర్నూ సమానంగా చూడటం ద్వారా తప్పు చేసిందంటూ ప్రస్తుత(మోడీ) సర్కార్ నిందించడం. కానీ, ఆర్టీఐ చట్టాన్ని రాజ్యాంగపరమైన హక్కుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం గమనార్హం. రాజ్యాంగంలోని అధికరణం 19(1)(ఏ) హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కైన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగా ఆర్టీఐ చట్టం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రాజ్యాంగంపై వక్రీకరణలతో కూడిన ప్రతిపాదనలతో రూపొందించిన సవరణ బిల్లును గట్టిగా అడ్డుకోవాల్సిన బాధ్యత రాజ్యసభ సభ్యులపై ఉన్నదని శ్రీధర్ ఆచార్యులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలు తమ సమాచార కమిషనర్లను నియమించుకునే వీలు లేకుండా ఆ అధికారాన్ని కూడా కేంద్రమే కబలిస్తున్న నేపథ్యంలో శ్రీధర్ ఆచార్యులు ఈ విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికవుతారన్నది తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలోని బెన్నెట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేస్తున్న శ్రీధర్ ఆచార్యులకు న్యాయశాస్త్రంలో బోధనాను భవంతోపాటు 2013 నుంచి 2018 వరకూ కేంద్ర సమాచార కమిషనర్గా పని చేసిన అనుభవం కూడా ఉన్నది.