Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాంబే హైకోర్టు సంచలన తీర్పు
నాగపూర్ : కులాంతర వివాహం చేసుకున్న దంపతుల బిడ్డకు కుల ధ్రువీకరణ పత్రం పొందేందుకు సవాలక్ష నిబంధనలు అడ్డు వస్తున్నాయి. పలు నిబంధనలు సాకుగా చూపి సంబంధిత పత్రాలు ఇవ్వడంలో అధికారులు కార్యాల యాల చుట్టూ తిప్పుకుంటున్న పరిస్థితులు దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇలా కులాంతర వివాహం చేసుకొని వ్యక్తిగత కారణాల వలన భర్తకు దూరంగా ఉంటున్న మహిళల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. సదరు మహిళ సంతానానికి ఏ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలన్న దానిపై ఇప్పటివరకూ అధికారవర్గాల్లో మీమాంస ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ చరిత్రలో నిలిచిపోయే సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఒంటరిగా ఉంటున్న మహిళల బిడ్డలు ఇకపై తమ తల్లి కులాన్ని ధ్రువపత్రాల్లో పొందవచ్చని పేర్కొంది. పిల్లవాడు తన తండ్రితో సంబంధాన్ని కోల్పోయిన తర్వాత తల్లి కులానికి చెందిన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, విలువలు నేర్చుకోవడం సహజమని కోర్టు స్పష్టం చేసింది.
'హాల్బా' అనే గిరిజన తెగకు చెందిన ఒక మహిళ గిరిజనేతరుడిని 1996, ఆగస్టు 8న వివాహం చేసుకున్నారు. అయితే అనంతరం వారిద్దరి మధ్య వచ్చిన కుటుంబ విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయి తన తల్లి ఇంటికి వచ్చి ఉంటున్నారు. 2003లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె తన తల్లితో పాటే ఉంటోంది. ఆ బాలిక పెరిగి పెద్దయిన తర్వాత తన ఉన్నత చదువులో రిజర్వేషన్ పొందే నిమిత్తం కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే చట్టం ప్రకారం ఎస్సి, ఎస్టి, బిసి, ఇతర ఏ కేటగిరీ కింద కూడా ఆమె సీటు ఇచ్చేందుకు పరిశీలన కమిటీ అధికారులు తిరస్కరించారు. సదరు యువతి తన తల్లికి చెందిన పత్రాలు సమర్పించారని, అయితే నిబంధనల ప్రకారం అది చెల్లుబాటు కాదని అధికారులు ఆమెకు నిర్ద్వందంగా అడ్మిషన్ తిరస్కరించారు. దీంతో ఆ యువతి కోర్టులో పిటిషన్దాఖలు చేశారు. ఈ విచారణ చేపట్టిన కోర్టు సర్టిఫికెట్ల పరిశీలన కమిటీ నిర్ణయాన్ని కొట్టిపారేసింది. కుల ధ్రువీకరణ పత్రం కోసం దాఖలు చేసుకున్న దరఖాస్తును పున:పరిశీలించి, రిజర్వేషన్ కేటగిరీ కింద ఉన్నత విద్యలో అడిష్మన్ పొందేలా చూడాలని జస్టిస్ సునీల్ సుక్రే, పుష్పా గనేడివాలాలతో కూడా ధర్మాసనం సబ్డివిజనల్ అధికారిని ఆదేశించింది. దంపతులు విడిపోయిన నాటి నుంచి పిటిషనర్ తన తల్లి వద్దనే ఉంటుంది కాబట్టి ఆ యువతి తల్లి కులానికి చెందిన ఆచారాలు, సంప్రదాయాలు అలవర్చుకొని ఆ వాతావరణంలో పెరిగి ఉంటుందని, సాధారణంగా అటువంటి వారికి కూడా తల్లి కులమే వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కమిటీ తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొంది. ఒక వేళ చట్టాల్లో ఉన్న నిబంధనలనే పరిగణనలోకి తీసుకున్నా కూడా తాము ఇచ్చిన తీర్పులో తప్పేం లేదన్నారు. ఒంటరిగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మహిళల విషయంలో కొంత ఉదారంగా, ప్రత్యేకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. 2003లో ఒక కోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా న్యాయమూర్తులు గుర్తుచేశారు. ఆ సమయంలో ఒక ఆరేళ్ల పాపను విడిపోయన దంపతుల్లో తల్లికి అప్పగించారని, ఆ తరువాత ఆ పాప తన తల్లి కుటుంబానికి చెందిన వ్యక్తిగా వారి కులానికి ఉండే రిజర్వేషన్లు పొందుతూ చదువుకుందని తెలిపారు.