Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి, భోపాల్: రోజురోజుకూ దేశంలో హిందూత్వ దాడులు, బెదిరింపులు పెరిగిపోతున్నాయి. మైనారిటీలను, దళితులను టార్గెట్ చేసిమరీ హిందూత్వ మూకలు దాడులకు, బెదిరింపులకు తెగబడుతున్నాయి. అలాంటి మరో ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 'జై శ్రీరామ్' అనాలంటూ ఇద్దరు ముస్లిం యువకులను వేధించిన ఘటన ఔరంగాబాద్లోని ఆజాద్ చౌక్ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు ముస్లిం యువకులు కలిసి పనికోసం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో కొందరు దుండగులు వీరిని ఆపి బెదిరింపులకు గురి చేశారు. 'జై శ్రీరామ్' అని అనాలంటూ వారిని భయపెట్టారు. కానీ దీనికి ముస్లిం యువకులు నిరాకరించడంతో వారిని తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని దుండగులు బెదిరించారు. ఈ తతంగం అంతా ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. బాధితుల్లో ఒకరైన షేక్ అమర్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్లో మూకదాడి
అక్రమంగా పశువులను తరలిస్తున్నాడని ఆరోపిస్తూ.. ఓ పశువుల వ్యాపారిపై కాషాయమూక దాడి చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కాట్ని జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ట్రక్కులో పశువుల వ్యాపారి అక్రమంగా 30 పశువులను తరలిస్తున్నాడన్న ఆరోపణలతో.. కాషాయమూక ఆ వాహనాన్ని అడ్డుకుంది. అనంతరం వ్యాపారిపై విక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఘటనలో పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి, వ్యాపారిని అరెస్టు చేశారు. వ్యాపారిపై పశు సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే అతనిపై దాడికి పాల్పడిన వారిపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు.ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరలవుతోంది.