Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దద్దరిల్లిన పెద్దలసభ... మూడు సార్లు వాయిదా
- పార్లమెంట్ ఆవరణంలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా నెలకొన్న పలు సమస్యలపై మోడీ సర్కారును ప్రతిపక్షాలు నిలదీశాయి. అధికార పార్టీ దాదాగిరి నశించాలని నినదించాయి. ప్రజా సమస్యలపై ఇరుసభల్లో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో సోమవారం రాజ్యసభ దద్దరిల్లింది. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు, డిమాండ్లతో సభ హోరెత్తింది. దీంతో సభలో నెలకొన్న గందరగోళం వల్ల సభ మూడు సార్లు వాయిదా పడింది. రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తుండగానే ప్రతిపక్షాల సభ్యులు ఆందోళన చేపట్టారు. తాము లేవనెత్తిన అంశాలపై చర్చ చేపట్టాలని సభ్యులు డిమాండ్ చేశారు. అంతకు ముందే సీపీఐ(ఎం) ఎంపీ ఎలమరం కరీం, సీపీఐ సభ్యుడు బినరు విశ్వం బీహార్లో జరిగిన మూక దాడి, ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రపై సభలో చర్చ జరపాలని చైర్మెన్కు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ బికె హరిప్రసాద్ కర్నాటక అంశంపై నోటీసులు ఇచ్చారు. వీటిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీనికి చైర్మెన్ అంగీకరించకపోవడంతో సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభను చైర్మెన్ గంట పాటు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో అదే పరిస్థితి కొనసాగింది. దీంతో ఉపసభాపతి హరివంశ్ సభను మళ్లీ గంటపాటు వాయిదా వేశారు. మధ్యాహ్నాం పున:ప్రారంభమైన సభలో మానవ హక్కుల సవరణ చట్టంపై చర్చకు ఆహ్వానించారు. దీనిపై సీపీఐ(ఎం) ఎంపీి ఎల్లమరం కరీం సవరణ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే సభలో సభ్యులు ఆందోళన కొనసాగడంతో గందరగోళం మధ్య సవరణలు ప్రవేశపెట్టలేమని, సభను అర్డర్లో పెట్టాలని వైస్ చైర్మెన్ హరివంశరారును సీపీఐ(ఎం) సభ్యుడు కోరారు. దీంతో సభను వాయిదా వేశారు.
పార్లమెంట్ ఆవరణంలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర హింసను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. సోమవారం పార్లమెంట్ ఆవరణంలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీిలు ధర్నా చేపట్టారు. ప్లకార్డుల చేతబట్టి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని అక్రమంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని కోరారు. ఈ ఆందోళనలో రాజ్యసభ ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్, లోక్సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి, ఎంపీలు కె.సురేష్, శశిథరూర్, కార్తీ చిదంబరం, కూమారి సెల్జా, బికె హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డి రాజాకు సీపీఐ(ఎం) ఎంపీలు అభినందనలు
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డీ రాజాకు సీపీఐ(ఎం) ఎంపీలు అభినందనలు తెలిపారు. సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజాను సీపీఐ(ఎం) ఎంపీలు టికె రంగరాజన్, పిఆర్ నటరాజన్, ఎస్. వెంకటేషన్ శాలువ కప్పి అభినందనలు తెలిపారు.