Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల చట్ట సవరణపై సీపీఐ(ఎం) ఎంపీ కరీం
- బిల్లు సవరణపై ప్రతిపక్షాల అభ్యంతరాలు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యమా లేక మూకస్వామ్యం నడుస్తుందా? సీపీఐ(ఎం) ఎంపీ ఎల్లమరం కరీం ప్రశ్నించారు. సోమవారం రాజ్యసభలో మానవ హక్కుల చట్టం - 1993 సవరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కరీం మాట్లాడారు. ప్రభుత్వం ఒకవైపు గోరక్షక్ల పేరిట సాగుతున్న దాడులను ప్రోత్సహిస్తూ... మానవ హక్కుల చట్టానికి సవరణలు తేవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎంతోకొంత అణగారిన ప్రజానీకానికి రక్షణగా ఉన్నటువంటి చట్టానికి సవరణ తేవడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. మానవ హక్కుల చట్టం సవరణ చేయడం ప్రస్తుత పరిస్థితికి సరైన విధంగా లేదని వ్యాఖ్యానించారు. ఒక బిల్లుకు సవరణ చేయాలంటే... ప్రస్తుత పరిణామాలు, బిల్లులో ఇంతకుముందు ఉన్న విషయాలపై లోతైన చర్చ జరగాల్సి ఉంది. అందుచేత బిల్లును తక్షణమే సర్కారు సెలెక్ట్ కమిటీకి పంపాలన్నారు. సంబంధిత బాధితులు, రాజకీయ పార్టీలు, ఎన్జీఓలతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు పోతున్నదని మండిపడ్డారు. ఎన్హెచ్ఆర్సీ, రాష్ట్రాల్లోని మానవ హక్కుల సంఘాల చైర్మెన్ల పదవులు సైతం ఎటువంటి కారణం చూపకుండానే వాటిని భర్తీ చేయడం లేదన్నారు. ఈ విషయంపై కేంద్రం దృష్టి పెట్టాల్సి ఉందని అన్నారు. కానీ, దీనిపై బిల్లులో ఎక్కడా పేర్కొనలేదన్నారు. సుమారు 8 నెలలు ఎన్హెచ్ఆర్సీ కమిషన్ చైర్మెన్ పోస్టును ఖాళీగా ఉంచినట్టు చెప్పారు. అదే విధంగా ఎన్హెచ్ఆర్సీలోని కేసులు విచారించేందుకు ఐజీ పోస్టును సుమారు మూడు సంవత్సరాలు భర్తీ చేయలేదని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మెట్టికాయలు వేసేదాకా ఇదే విధమైన ధోరణిని ప్రభుత్వం ప్రదర్శించిందన్నారు. ఈ విధమైన అంశాలపై ప్రస్తుతం సవరణ చేస్తున్న బిల్లు కూడా ఎక్కడా ఊడా ప్రస్తావించలేదన్నారు. అయితే, ఈ విషయంలో ఇప్పటికైనా ఎన్హెచ్ఆర్సీలో ఖాళీ ఏర్పడితే ఎప్పటిలోగా నియమించాలో అన్న అంశంపై ఖచ్చితమైన కాల పరిమితి విధించాలని డిమాండ్ చేశారు. మానవ హక్కులు వాటి పరిరక్షణపై మాట్లాడేందుకు ఈ ప్రభుత్వానికి ఎటువంటి నైతికత లేదని భావిస్తున్నట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజానీకంపై దాడులు చేసేందుకు ఉసిగొల్పుతున్న దారుణ పరిస్థితి ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? లేక మూకస్వామ్యం కొనసాగుతున్నదా? అని ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు అడ్డా అని స్పష్టం చేశారు. ఎన్ని విభిన్నతలు ఉన్నప్పటికీ, కలసికట్టుగా ఉండటమే భారత దేశ జీవన విధానంలో భాగమన్నారు. అటువంటి దేశంలో జాతి, మతం, కులం పేరిట ఏ విధంగా దాడులు చేస్తారని విమర్శించారు. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో బీతావాహ వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ప్రదేశాల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను సాధించేందుకు ప్రభుత్వం ఒక్క చర్యనూ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎన్నో ఎన్జీఓలు సైతం నివేదికలు బహిర్గతం చేశాయని వివరించారు.
ఆర్టీఐ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: పీఆర్ నటరాజన్
మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీపీఐ(ఎం) లోక్సభ పక్షనేత పీఆర్ నటరాజన్ స్పష్టం చేశారు. ఈ బిల్లు రూపేణా ప్రభుత్వం ఆర్టీఐ వ్యవహారాలు శాసన వ్యవస్థ నుంచి అధికారాన్ని కార్యనిర్వాహక వ్యవస్థకు ఇస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది వరకు ఉన్నటువంటి ఆర్టీఐ బిల్లు అధికారాలను కట్టడి చేయవద్దని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు సవరణ తేవడం అంటే దేశ సమాఖ్య విధానానికి విఘాతం కల్గించడమేనని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని తాను మరొకసారి కోరుతున్నానని వివరించారు.