Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఒత్తిడి
- 18 నెలలుగా జీతం నిలిపివేత
- జేఎన్యూలో ఉన్నతాధికారుల నిర్వాకం
న్యూఢిల్లీ : మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదాలకు నెలవుగా మారిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో విద్యార్థులకే కాదు.. ప్రొఫెసర్లకూ వేధింపులు తప్పడం లేదు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వర్సిటీలో 'మత' రాజకీయం కొనసాగుతున్నది. వర్సిటీలో ఓ మహిళా ప్రొఫెసర్.. 'ముస్లిం' వ్యక్తి కావడంతో ఆమె వివక్షను ఎదుర్కొన్నది. ప్రొఫెసర్ ఉద్యోగానికి సదరు మహిళ రాజీనామా చేసేలా వర్సిటీలోని 'పెద్ద తలకాయలే' ఆమెపై ఒత్తిడి చేశాయి. దాదాపు 18 నెలల పాటు బాధిత మహిళకు రావాల్సిన జీతభత్యాలను వర్సిటీ యంత్రాంగం నిలిపివేసింది. నివాసాన్ని ఖాళీ చేయాలంటూ ఆమె ఇబ్బందులపాలయ్యేలా యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేసింది. కేవలం తాను 'ముస్లిం' అన్న ఒక్క కారణంతోనే తనపై ఈ విధమైన వేధింపులు జరుగుతున్నాయని సదరు మహిళ ఢిల్లీ మైనార్టీస్ కమిషన్(డీఎంసీ)కి రాసిన లేఖలో వాపోయింది.
యూనివర్సిటీలోని సెంట్ ఫర్ ది స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూషన్ అండ్ ఇంక్లూషన్ పాలసీ(సీఎస్ఎస్ఈఐపీ)లో రోసినా నసీర్(40) అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. 2013కు ముందు నాలుగేండ్ల పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో పర్మినెంట్ ఫ్యాకల్టీగా పనిచేసింది. జేఎన్యూ వర్సిటీ వీసీ మామిడాల జగదీశ్కుమార్, సీఎస్ఎస్ఈఐపీ చైర్పర్సన్ యాగాటి చిన్నారావు లు తనను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురిచేస్తూ తన పట్ల వివక్ష చూపిస్తున్నారని డీఎంసీ చైర్మెన్కు రాసిన లేఖలో పేర్కొన్నది. తాను ఉద్యోగానికి రాజీనామా చేసే విధంగా జేఎన్యూలోని ఇద్దరు 'బలమైన వ్యక్తులు' బలవంతం చేస్తున్నారని, అది తనకు, తన పిల్లల భద్రత పట్ల ఆందోళనను కలిగిస్తున్నదని వాపోయింది. ఒకవేళ నేను ఫ్యాకల్టీ ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే.. జేఎన్యూ విద్యార్థి నజీబ్ లాగే తాను అదృశ్యమయ్యే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. సీఎస్ఎస్ఈఐపీ స్కీంను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పొడగించినప్పటికీ.. 2017 అక్టోబర్ నుంచి జేఎన్యూ.. ఆమె జీతాన్ని నిలిపివేసి ఇబ్బందులపాలయ్యేలా గురిచేసింది. ఈ పథకానికి యూజీసీ నిధులను కేటాయించినా, కేటాయించకపోయినా రాష్ట్రాల్లోని వర్సిటీలు ఫ్యాకల్టీకి జీతాలు చెల్లించాలనే యూజీసీ నిబంధన ఉన్నది. అయితే నసీర్ శాశ్వత ఉద్యోగిని కాదని, యూజీసీ ఆమె జీతాన్ని విడుదల చేయనప్పుడు తామేం చేస్తామని వర్సిటీ అధికారులు తెలియజేయడం గమనార్హం.
అయితే ఇదే విషయమై గతేడాది నవంబర్లో నసీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించి కేసును గెలిచింది. దీంతో ఈ ఏడాది మేలో ఆమె జీతాన్ని యాజమాన్యం విడుదల చేసింది. సీఎస్ఎస్ఈఐపీ స్కీం ను 2020 మార్చి వరకు యూజీసీ పొడిగించింది. అయితే వర్సిటీ యాజమాన్యం మాత్రం ఉద్దేశపూర్వకంగా ఆమె జీతభత్యాలను ఏప్రిల్ నుంచి మళ్లీ నిలిపివేసింది. తాను ముస్లింను అన్న ఒక్క కారణంతోనే వర్సిటీలోని 'పెద్దల'కు లక్ష్యంగా మారానని, విద్యారంగంలో తాను అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేయాలని వర్సిటీ రెక్టార్తో పాటు అధికారులు తనను అడిగారని నసీర్ వివరించింది. జేఎన్యూ క్యాంపస్లోనే తన కుటుంబంతో నివసిస్తున్న ఆమెకు.. తన నివాసాన్ని సైతం ఖాళీ చేయాలన్న ఆదేశాలు 'పై నుంచి' పలుసార్లు అందాయి. నసీర్ కెరీర్పై ప్రభావం చూపేలా వర్సిటీలోని విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ పర్యవేక్షణకు, బోధనకు యాజమాన్యం నిరాకరించింది. క్లాస్ కమ్ కమిటీ గదిని ఉపయోగించుకోకుండా చైర్పర్సన్ చిన్నారావు పావులు కదిపారని, అలాగే టెలిఫోన్, ఇంటర్నెట్, అధికారిక ఇ-మెయిల్ ఐడీతో పాటు తన వెబ్పేజ్ ప్రొఫైల్ను బ్లాక్ చేశారని నసీర్ వివరించింది. అయితే దీనిపై అంతర్గతంగా తాను ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని తెలిపింది.
జేఎన్యూ రిజిస్టార్కు డీఎంసీ నోటీసు
ఈ విషయంలో జేఎన్యూ రిజిస్ట్రార్కు నోటీసుతో పాటు మధ్యంతర ఉత్తర్వును డీఎంసీ పంపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు అధికారాలను దుర్వినియోగం చేస్తూ బాధితురాలిని వేధింపులకు గురిచేసినట్టు ప్రాథమిక విచారణ ఆధారంగా విశ్వసిస్తున్నామని డీఎంసీ తెలిపింది. ముస్లింను కావడం వల్లనే తనపై ఇలాంటి వివక్ష అన్న బాధితురాలి వ్యాఖ్యలు నమ్మదగినవిగా భావిస్తున్నామని అభిప్రాయపడింది. ఆగస్టు 1లోగా లిఖితపూర్వకంగా స్పందించాలని లేకపోతే వీసీ, సీఎస్ఎస్ఈఐపీ చైర్పర్సన్పై కేసు నమోదు చేస్తామని వర్సిటీ రిజిస్ట్రార్కు డీఎంసీ తెలిపింది.