Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని
- మధ్యప్రదేశ్లో విద్యుత్ కార్మికుల ఆందోళన
- సీఎం కమల్నాథ్ ఇంటివైపు వెళ్లకుండా అడ్డగింత
భోపాల్ : మధ్యప్రదేశ్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విద్యుత్ కార్మికులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ.. సీఎం కమల్నాథ్ దృష్టికి తీసుకెళ్లాలని భావించిన కాంట్రాక్టు వర్కర్లపై లాఠీచార్జ్ చేశారు. శాంతియుతంగా మార్చ్ చేసేందుకు సిద్ధమవగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మధ్యప్రదేశ్లో మూడు విద్యుత్ పంపిణీ కంపెనీలు మధ్యక్షేత్ర విద్యుత్ వితరణ్ కంపెనీ, పూర్వ్ క్షేత్ర విద్యుత్ వితరణ్ కంపెనీ, పశ్చిమ్ క్షేత్ర విద్యుత్ వితరణ్ కంపెనీలతోపాటు హౌల్డింగ్ కంపెనీ మధ్యప్రదేశ్ పవర్ మేనేజ్మెంట్ కంపెనీ(ఎంపీపీఎంసీ)లు దాదాపు 40వేల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను నియమించుకున్నాయి. వీరు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని ఈ నెల 11న భోపాల్లోని అంబేద్కర్ పార్క్ గేటు ముందు ఎంపీ విద్యుత్ ఔట్సోర్స్డ్ ఎంప్లాయీస్ సంఘటన్ బ్యానర్ కింద ధర్నాకు దిగారు. అనంతరం ఎన్నికల మ్యానిఫెస్టోను ఉటంకిస్తూ ఓ మార్చ్ను చేపట్టారు. ఈ రెండు కార్యక్రమాలకూ ముందస్తుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నట్టు కార్మికులు తెలిపారు. ఔట్సోర్స్డ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కమల్నాథ్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో హామీనిచ్చిందని ఆందోళనకారులు చెబుతున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దీని ఊసే ఎత్తడం లేదని అన్నారు. కొన్ని ఏజెన్సీలతో కార్మికులను కాంట్రక్టు, ఔట్సోర్సింగ్ కింద గత ప్రభుత్వాలు నియమించుకున్నాయని చెప్పారు. అవసరమున్న సిబ్బంది కన్నా తక్కువ మందినే నియమించారని, దీంతో అవినీతి పెరిగిపోతున్నదని డిస్కమ్ కాంట్రాక్టు వర్కర్ల సంఘం మధ్యప్రదేశ్ సంధివ అధికారి కర్మచారి మహాసంఫ్ు అధ్యక్షుడు రమేశ్ రాథోర్ అభిప్రాయపడ్డారు. దీంతోపాటు నియామకమైన కార్మికులు అధిక పని చేయాల్సి వస్తున్నదని చెప్పారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ వారి కంటే తక్కువ వేతనాన్ని పొందుతున్నారని, వారిలా ఇతర ప్రయోజనాలను పొందడం లేదని అన్నారు. కాగా, కమల్నాథ్ ప్రభుత్వం తమకిచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను సీఎం కమల్నాథ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన నివాసానికి శాంతియుతంగా మార్చ్ చేపట్టేందుకు సిద్ధమయ్యామని నిరసనకారులు చెప్పారు. శాంతియుతంగా చేపట్టిన తమ మార్చ్ను పోలీసులు అడ్డుకున్నారని, లాఠీచార్జ్ చేశారని తెలిపారు.