Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోనియాతో పార్టీకి మళ్ళీ పునర్వైభవం అంటోన్న నేతాగణం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజకీయాల్లో గణనీయ పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ నేడు ఉనికి కాపాడుకునేందుకు అపసోపాలు పడుతున్నది. అయితే, ఇటీవల ఆ పార్టీలో జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిల పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో తలెత్తిన నాయకత్వం సంక్షోభానికి యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ నియామకంతో కొంతమేర పుల్స్టాప్ పెట్టినట్టు కనిపించినా నాయకత్వలేమి ఆ పార్టీని ఇంకా వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడమే కాకుండా, గాంధీయేతర నేతలే పార్టీని నడిపించాలన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కొత్త అధ్యక్షుడి వేటలో పలువురి పేర్లు తెరపైకి వినిపించాయి. అయితే, అవన్నీ కేవలం వార్తల కోసమే తప్ప, వాస్తవ కార్యాచరణ కోసం కాదని తాజా ప్రకటనతో రుజువైంది. అంతా కలిసి పలు చర్చలు జరిపినా... చివరకు గాంధీ-నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ దిక్కు అయింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాకే పట్టం కట్టినా, కొత్త అధ్యక్షుడి ఎంపిక అసలు ఇప్పట్లో ఉంటుందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.దేశానికి స్వాతంత్య్ర వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నెహ్రూ, ఇందిరా, రాజీవ్లు సమర్థవంతంగా నడిపించినా.. వారి తర్వాత ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం ఆ పార్టీలో అంతర్గత పోరు, బీజేపీ పుంజుకుంటోన్న సందర్భంలో అనూహ్యంగా 1998లో మళ్లీ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలు చేపట్టిన సోనియా దాదాపు 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్కి అధ్యక్షురాలిగా కొనసాగారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, ప్రభావిత నాయకుల జాబితాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోగా 2014లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన విషయం విదితమే. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో బాధ్యుడిగా రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.అయితే పార్టీలోని సీనియర్ నేతలు మొదలు, రాష్ట్ర స్థాయి నాయకులదరూ ఆ కుటుంబం తప్ప మరే దిక్కులేదని వ్యాఖ్యానించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ సోనియానే పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. అనారోగ్య కారణాల వల్ల ఆమె గతంలో మాదిరిగా చురుగ్గా, క్రియాశీలకంగా ఉండ కపోయినా, ఆమె సుదీర్ఘానుభవంతో చేసే సూచనలనతో పార్టీని నడింపిం చవచ్చనే అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేశారు. తాత్కాలికంగానే సోనియా ఈ పదవిలో కొనసాగుతారని చెబుతున్నా, కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు ఎన్నుకొంటారు, ఏ విధంగా ఆ ప్రక్రియ ఉంటుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.