Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లలో రూ.350 లక్షల కోట్లు అంటూ ప్రగల్బాలు
- ఆర్థికంలో పూర్తి అనిశ్చిత పరిస్థితులు
- చుట్టుముడుతున్న మాంద్యం ముప్పు
- హెచ్చరిస్తున్న ఆర్థికవేత్తలు
నవతెలంగాణ, జనరల్డెస్క్
ఐదేండ్లలో (2024 వరకల్లా) దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు(రూ.350 లక్షల కోట్లకు) చేర్చడమే తన లక్ష్యంగా ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగిస్తూ తన ప్రభుత్వం రానున్న ఐదేండ్ల కాలంలో సాధించగల కార్యాల గురించి ఏకరువు పెట్టారు. బడ్జెట్ సందర్భంగా వెల్లడించిన ఆర్థిక సర్వేలోనూ జీడీపీ వృద్ధిరేట్ లక్ష్యాలను మోడీ సర్కార్ ప్రకటించింది. 2024 వరకల్లా దేశ జీడీపీని 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని అందులోనూ చెప్పారు.
మోడీ కలలు నిజం కావాలంటే 2024 వరకల్లా జీడీపీ వృద్ధిరేట్ను 17 శాతానికి చేర్చాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ, గత ఐదేండ్ల కాలంలో మోడీ సర్కార్ ఆర్థిక విధానాల సామర్థ్యం ఏమంత ఆశాజనకంగా లేకపోవడం పట్ల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2018-19 సంవత్సరపు చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో జీడీపీ వృద్ధిరేట్ 5.8 శాతానికి పడిపోయినట్టు అధికారిక లెక్కల్లోనే తేలింది. అదే ఏడాది మొత్తమ్మీద జీడీపీ వృద్ధిరేట్ 6.8 శాతంగా నమోదైంది. పన్నుల వసూళ్లు కూడా ఆశాజనకంగా లేవు. పన్నుల వృద్ధిరేట్ 1.4 శాతానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే 2019-20కి జీడీపీ వృద్ధిరేట్ను మొదట్లో 7 శాతంగా అంచనా వేయగా, ఇప్పుడది 6 శాతంపైగానైనా నమోదవుతుందా అన్నది అనుమానాస్పదంగా మారింది.
మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ప్రయివేట్ రంగం లాభాల బాటలో నడిచి, తమ పెట్టుబడులను మరింత విస్తరించినపుడే జీడీపీ వృద్ధిపై పాజిటివ్ ప్రభావం చూపుతుంది. కానీ, ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్లు నెగెటివ్గా ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే ప్రభుత్వం చొరవ చూపి పెట్టుబడులకు ఊతమివ్వాలి. కానీ, ప్రభుత్వం దగ్గర తగినన్ని నిధులు లేకనే ఆర్బీఐని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆర్బీఐకీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలకూ మధ్య జరిగిన విధానపరమైన సంఘర్షణలో ఇద్దరు ఉన్నతాధికారులు రాజీనామాలు సమర్పించి బయట కు వెళ్లిన సంఘటనలు చూశాం. అదే సమయంలో బ్యాంకు లు మొండి బాకీలతో సతమతమవుతున్నాయి. బ్యాంకుల మొండి బాకీలు(ఎన్పీఏలు) రూ.9 లక్షల 34వేల కోట్లకు చేరినట్టు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్ ప్రసం గంలోనే వెల్లడించారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వరంగ బ్యాంకులు అప్పులు ఇచ్చే స్థితిలో లేనందునే ఉద్దీపన పథకాలకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నది గమనార్హం.
వాహనరంగం గత 20 ఏండ్లలో మునుపెన్నడూ లేనంత సంక్షోభంలోకి కూరుకుపోయింది. కార్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు బాగా తగ్గాయి. ఈ రంగంలో ఇప్పటికే రెండు లక్షల 30 వేలమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇటీవల 300 డీలర్షిప్లు మూతపడ్డట్టు భారత వాహనదారుల సంఘం(సియామ్) తెలిపింది. ఈ రంగంలో 10 లక్షల ఉద్యోగాలపై ప్రభావం పడనున్నట్టు సియామ్ తెలిపింది.
భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరాస్థి రంగాన్ని ఓ బలమైన సూచికగా ఆర్థికవేత్తలు భావిస్తారు. ఈ రంగానికి అనుబంధంగా దాదాపు 250 రకాల పరిశ్రమలు(ఇటుకల తయారీ,సిమెంట్,స్టీల్, ఫర్నీచర్,విద్యుత్ పరికరాలు, రంగుల పరిశ్రమ, వగైరా) ఆధారపడి ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఏడాది కాలంగా ఇండ్ల అమ్మకాలు బాగా తగ్గాయి. ఈ రంగంలోని రీసెర్చ్ సంస్థ లయసెస్ ఫోరాస్ ప్రకారం 42 నెలలుగా అమ్మకాలు లేక పెట్టుబడులు వెనక్కిరాని స్థితి. ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తుత మన ఆర్థిక వ్యవస్థ 2 లక్షల 70 వేల కోట్ల డాలర్లకు చేరిందని చెప్పిన ప్రధాని మోడీ మరో ఐదేండ్లలో 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్నది తన లక్ష్యంగా తెలిపారు. అందుకోసం రానున్న ఐదేండ్లలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఇప్పుడు ఆర్థిక నిపుణులు వేస్తున్న ప్రశ్న అన్ని నిధులు ఎలా సమకూరుస్తారన్నది ప్రశ్న.
ఐదేండ్లలో రూ.100 లక్షల కోట్లంటే సగటున ఏడాదికి రూ.20 లక్షల కోట్ల చొప్పున మౌలిక వసతుల కల్పనకు కేటాయించాలి. ప్రస్తుతం మౌలిక వసతులకు కేటాయిస్తున్నది సుమారు రూ.6 లక్షల కోట్లు మాత్రమే. మిగతా నిధులు ఎక్కడి నుంచి తెస్తారు..?
మరోవైపు ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఆర్థిక మాం ద్యం దిశగా పయణిస్తున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఇటీవల బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపో వడాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. మన మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.38 వేల మార్క్ దాటడం తెలిసిందే. రెండు వారాల్లోనే మూడువేలకుపైగా ధర పెరగడం ఆందోళన కలిగించేదే. 2008 ప్రపంచ మాంద్యానికి ముందు కూడా బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోవడం గమనార్హం. మన దేశానికి సంబంధించి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, ఖరీదైన వస్తువుల అమ్మకాలు తగ్గడం రానున్న ఆర్థిక మాంద్యానికి సూచికలుగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు.