Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో:
తెలంగాణలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. అక్కడి ప్రజానీకం అభీష్టానికి వ్యతిరేకంగా యురేనియం తవ్వకాలు జరిపితే యావత్ తెలంగాణ ప్రజలు దాని పరిణామాలు ఎదుర్కొంటారని అన్నారు. దానివల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రమాదం ఉండే పరిస్థితి ఉంటుందని ఆయన హెచ్చరించారు. శుక్రవారం కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తవ్వకాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ వేల సంవత్సరాల జీవనం కొనసాగిస్తున్న చెంచులు, కోయల బతుకులు ప్రశ్నార్థకం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమంగా వారంతా అంతరించి పోతారని వాపోయారు.
ఆదివాసీలకు భారత రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించిందని గుర్తు చేశారు. అందుచేత, ఈ తవ్వకాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని సూచించారు. అమ్రాబాద్లో కూడా ఇదే సమస్యగా మారిందన్నారు. యురేనియం కోసం అక్కడున్న చెంచులను, కొయ్యలను వెళ్లగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయడం దారుణమన్నారు. యురేనియం తవ్వకాల వల్ల ఇప్పుడు మాత్రమే కాకుండా భవిష్యత్లో చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. కేంద్రం లో యూపీఏ ప్రభుత్వం ఉన్న ప్పుడు యూనివర్సిటీ ఎస్సీ, బీసీ విద్యార్థులకు రాజీవ్ ఫెలోషిప్ ఇచ్చేవారని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం మోడీ సర్కారు మాత్రం రాజీవ్ ఫెలోషిప్ ఇవ్వడం లేదన్నారు. ప్రధాని మోడీకి పథకం నచ్చకపోతే వేరే పథకం ద్వారా అయినా ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఫెలోషిప్ ఇప్పించాలన్నారు.