Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 రోజులు కర్ఫ్యూ నీడలోనే కాశ్మీర్
- నిర్బంధ కేంద్రాలు చాలక.. ప్రయివేటు ఇండ్ల వినియోగం
- ప్రజాస్వామ్య పరిహాసమే: 200 మంది రచయితలు, కార్యకర్తల ప్రకటన
- దశలవారీగా ఆంక్షలు సడలిస్తాం.. ఎలాంటి ప్రాణ హానీ జరగలేదు : అధికారులు
జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆంక్షల సంకెళ్లలోనే కాలాన్ని వెళ్లదీస్తున్నారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలు, రాకపోకలు లేకుండా ఇంటి నుంచి బయటకు రాకుండా కర్ఫ్యూ విధించి శుక్రవారంనాటికి 12 రోజులు గడిచాయి. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకునే ముందు రోజు ఆ రాష్ట్ర మాజీ సీఎంలను హౌజ్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాగే, రాజకీయ కార్యకర్తలు, యువకుల అరెస్టులూ ప్రతిరోజు చోటుచేసుకుంటున్నాయని కథనాలు వచ్చాయి. వీరికి నిర్బంధ కేంద్రాలు సరిపోకపోవడంతో ప్రయివేటు ఇండ్లనూ వినియోగిస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్లో బలగాల మోహరింపు ఎప్పటిలాగే ఉన్నా.. అక్కడక్కడ ప్రజలు బయట రాకపోకలు సాగించేందుకు అనుమతినిచ్చామనిజమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి చెప్పారు.
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుకు ముందునుంచే రాజకీయ నేతలు, కార్యకర్తలను గృహ నిర్బంధంలోకి తీసుకుంటూనే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో కర్ఫ్యూ విధించినప్పటి నుంచి అనేకమంది రాజకీయ కార్యకర్తలు, యువకులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిసింది. దాదాపు వేయి మందికిపైనే అదుపులోకి తీసుకుని ఉంటారని, దీంతో వారిని కస్టడీలో ఉంచేందుకు ప్రభుత్వ నిర్బంధ కేంద్రాలు సరిపోవడం లేదని ఓ కథనం వెల్లడించింది. దీంతో ప్రయివేటు ఇండ్లను నిర్బంధ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న దాదాపు 560 మంది రాజకీయ కార్యకర్తలను శ్రీనగర్లోని షెర్ ఇ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, బారాముల్లా, గురెజ్లలోని పలు సెంటర్లలో ఉంచారు. రాజకీయంగా క్రియాశీలంగా ఉండి, గతంలో రోడ్లపైకి వచ్చి రాళ్లురువ్వే చరిత్ర ఉన్న యువకులనే అధికంగా అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
త్వరలో ఫోన్లైన్ల పునరుద్ధరణ
జమ్మూ కాశ్మీర్లో అమల్లో ఉన్న ఆంక్షలను దశలవారీగా, ప్రాంతాలవారీగా ఎత్తేస్తామని ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. టెలిఫోన్ లైన్ల పునరుద్ధరణ ప్రక్రియ శుక్రవారం రాత్రి నుంచే ప్రారంభమవుతుందని మీడియానుద్దేశించి చెప్పారు. పాఠశాలలు వచ్చే వారం నుంచి అదికూడా ప్రాంతాలను బట్టి పున:ప్రారంభ మవుతాయని అన్నారు. కాగా, కర్ఫ్యూ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రాణహాని జరగలేదని వెల్లడించారు. ప్రజల రాకపోకలను కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అనుమతించామని, అయితే మోహరించిన బలగాలను మాత్రం తగ్గించలేదని చెప్పారు. కాగా, పాకిస్థాన్ బార్డర్ దాకా ప్రయాణించే జోద్పూర్-మునాబవో థార్ లింక్ ఎక్స్ప్రెస్ ట్రెయిన్ను సర్కారు రద్దు చేసింది.
పిటిషన్ల విచారణ వాయిదా వేసిన సుప్రీం
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్లో ఆంక్షల విధింపును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని, కాబట్టి సర్కారుకు కాస్త సమయమిద్దామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోరు అన్నారు. అప్పటి వరకు రక్షక దళాలపై విశ్వాసముంచాలని సూచించారు. జమ్మూ కాశ్మీర్లో పాత్రికేయులపై ఆంక్షలను వెంటనే ఎత్తేసేలా కేంద్రానికి, జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్కు ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టు కోరుతూ కాశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ దాఖలు చేసిన పిటిషన్పై గొగోరు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పందించింది. ఆంక్షలను దశలవారీగా ఎత్తేస్తున్నట్టు వార్తాపత్రికల్లో చదివారని గొగోరు అన్నారు. కాబట్టి సర్కారుకు సమయమివ్వాలని సూచించారు. తదుపరి విచారణ తేదీనీ ప్రకటించలేదు.
అమిత్ షాకు మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె లేఖ
జమ్మూ కాశ్మీర్పై కేంద్ర నిర్ణయాలను నిరసిస్తూ.. అమిత్ షాకు మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా జావేద్ లేఖ రాశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలను బోనులో జంతువుల్లా నిర్బంధించారని, వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని అందులో పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తనను బెదిరిస్తున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో అణచివేతకు లోనైనవ్యక్తి తన బాధనూ చెప్పుకునే హక్కు లేదా? అని ప్రశ్నించారు. వాస్తవాలు చెబుతున్నందుకు తనను ఒక యుద్ధ నేరస్తురాలిలా చూస్తున్నారని గృహ నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న జావేద్ లేఖలో పేర్కొన్నారు.
బీజేపీ లీగల్ వింగ్ ఒత్తిడితో
ఆర్టికల్ 370పై ఉపన్యాసం రద్దు :
బీజేపీ లీగల్ వింగ్ ఒత్తిడితో ఆర్టికల్ 370 రద్దుపై ఉపన్యాసాన్ని మద్రాస్ బార్ అసోసియేషన్ రద్దు చేసింది. మద్రాస్ బార్ అసోసియేషన్ సభ్యుడైన సీనియర్ న్యాయవాది కెఎం విజయన్ ఆర్టికల్ 370 రద్దుపై ప్రసంగించేందుకు మద్రాస్ బార్ అసోసియేషన్ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కానీ, విజయన్ ప్రసంగం మొదలుకు కొన్ని నిమిషాల ముందు కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు బార్ అసోసియేషన్ తెలిపింది. బీజేపీ లీగల్ వింగ్కు చెందిన కొందరి న్యాయవాదల అభ్యర్థన మేరకు ఈ ప్రసంగాన్ని వాయిదా వేస్తున్నట్టు వివరించింది. ఆర్టికల్ 370 రద్దుపై కోర్టులో విచారణ జరుగుతున్నందున చర్చ సరికాదని వారు తెలిపినట్టు బార్ ప్రెసిడెంట్ సుందరేసన్ చెప్పారు. తాను కేవలం కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధతపై మాత్రమే చర్చిస్తానని ముందే స్పష్టంగా చెప్పానని అడ్వకేట్ కెఎం విజయన్ తెలిపారు. తన ప్రసంగం కేవలం న్యాయపరమైన విషయాలకే పరిమితమైందని అన్నారు.
కాగా, మద్రాస్ బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంపై న్యాయమూర్తులు మండిపడ్డారు. కోర్టులో వాదనలు జరుగుతున్నందున ప్రసంగం వద్దనడం కేవలం ఒక సాకు మాత్రమేనని రిటైర్డ్ న్యాయమూర్తి కె చంద్రు అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఎన్నో విషయాలను బార్ అసోసియేషన్ గతంలో చర్చించిందని, ఇలాంటి చర్చలు, ఉపన్యాసాలతో న్యాయవాదలకు ఆ అంశాలపై విస్తృత అవగాహన ఏర్పడుతుందని చెప్పారు.
ప్రజాస్వామ్య పరిహాసమే : 200 మంది రచయితలు, కార్యకర్తల ప్రకటన
జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హౌదా రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి కేంద్ర ప్రభుత్వం.. రాజ్యాంగాన్ని పరిహసించింది. భారత యూనియన్లో జమ్మూ కాశ్మీర్ను చేర్చుకున్నప్పుడు ఆ ప్రాంతానికి ఇచ్చిన విశ్వసనీయమైన హామీనే మోడీ సర్కారు ఉల్లంఘించిందని 217 మంది రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమిత్ భాదురి, ఆనంద్ తేల్తుంబ్డే, ప్రభాత్ పట్నాయక్, అమితవ్ ఘోష్, అపూర్వానంద్, బెజవాడ విల్సన్, టీఎం కృష్ణ, హర్షమంద్, ఇందిరా జైసింగ్, నందిని సుందర్, నయనతార సెహగల్, పి సాయినాథ్సహా 217 మంది సంతకం చేసిన ఓ ప్రకటనను శుక్రవారం విడుదల చేశారు. ఏకపక్ష ధోరణిలో, రహస్యంగా, బలప్రయోగంతో, అక్కడి ప్రజల ఆమోదం లేకుండానే ఆర్టికల్ 370 రద్దు, కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టే నిర్ణయాన్ని కేంద్ర సర్కారు తీసుకున్నదని వారు పేర్కొన్నారు. అక్కడి ప్రజల ఆగ్రహావేశాలు, అసంతృప్తిని ఎదుర్కోవలసి వస్తుందని కేంద్రం భయపడుతుందనడానికి.. ఆ ప్రాంతంలో మునుపెన్నడూ లేనంతగా బలగాల మోహరింపే నిదర్శనమని తెలిపారు. భారతీయ రచయితలు, కళాకారులు, మీడియా ప్రతినిధులు, సాంస్కృతిక కార్యకర్తలమైన తాము.. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ఈ నిర్ణయాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టే నిర్ణయం రాజ్యాంగం ప్రవచిస్తున్న సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తున్నదని తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో కర్ఫ్యూను వెంటనే ఎత్తేయాలని పేర్కొన్నారు. కాశ్మీరీయులకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ.. జమ్మూ కాశ్మీర్ స్వేచ్ఛా స్వతంత్రతను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను తోటి పౌరులూ ప్రతిఘటించాలని కోరారు.
గ్రేటర్ కాశ్మీర్ జర్నలిస్టు అరెస్టు
జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ ఆంగ్ల పత్రిక గ్రేటర్ కాశ్మీర్ జర్నలిస్టు ఇర్ఫాన్ మాలిక్(26)ను పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలని ఓ వైపు పత్రికలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పోలీసులు జర్నలిస్టును అరెస్టు చేయడం గమనార్హం. పుల్వామా జిల్లాలో త్రాల్లోని తమ నివాసంలోకి గురువారం రాత్రి పోలీసులు వచ్చారని, తమ కుమారుడిని వారితోపాటు తీసుకెళ్లారని ఇర్ఫాన్ తల్లిదండ్రులు చెప్పారు. అతని అరెస్టుకు కారణమేంటో వారికి చెప్పలేదని, తమ కుమారుడికీ తెలియదనీ అన్నారు. ఇర్ఫాన్ మాలిక్ అరెస్టు.. కర్ఫ్యూ కాలంలో మొదటి జర్నలిస్టు అరెస్టుగా నమోదైందని ఓ పత్రిక తెలిపింది.