Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెహ్లూఖాన్ కుమారుడు అరిఫ్ ఖాన్
అల్వార్/జైపూర్ : ప్రస్తుత భారత దేశంలో ముస్లింలు న్యాయం పొందడం కష్టమేనని అల్వార్ మూకదాడి బాధితుడు పెహ్లూఖాన్ కుమారుడు అరిఫ్ ఖాన్ వ్యాఖ్యానించాడు. 'చూడబోతే నా తండ్రిని ఎవరూ చంపినట్టు లేదు. ఆయనను ఆయనే చంపుకున్నాడు. అతనిపై మూక దాడి జరగలేదు' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. '2017 నుంచి న్యాయం కోసం మేం తిరగనిచోటు లేదు. అయితే మా గోడును వినేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. దానికి కారణం
మేం ముస్లింలు కావడమే. మేం మెజార్టీ మతానికి చెందిన వారమైవుంటే ఖచ్చితంగా న్యాయం పొంది ఉండేవాళ్ళం. నా తండ్రిని చంపిన హంతకులు విడుదల కావడం బాధాకరంగా ఉంది. దేశంలోని న్యాయవ్యవస్ధ పట్ల విశ్వాసాన్ని కోల్పోయాం' అన్నారు. రాజస్థాన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంతో ఆశ పెట్టుకున్నామనీ, మత వివక్ష లేని ఈ పార్టీ తమకు న్యాయం చేస్తుందనే అనుకున్నామనీ, కాని ఆ పార్టీ కూడా మెజార్టీ పక్షానే నిలిచిందని వాపోయారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో మూకదాడి జరిగిందని చెప్పారు. ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో మూకలు జరిపిన మూకదాడిలో పెహ్లూఖాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దోషులను నిర్దోషులుగా పేర్కొంటూ అల్వార్ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది.