Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురు రవిదాస్ ఆలయ నిర్మాణంలో కేంద్రం పక్షపాతం
న్యూఢిల్లీ : ఆలయాల విషయంలో బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చివేసిన స్థానంలోనే దానిని నిర్మించాలని పట్టుబట్టే బీజేపీ, గురు రవిదాస్ ఆలయ పునర్నిర్మాణంపై వ్యవహరిస్తున్న వైఖరిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని గురు రవిదాస్ ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరీకి శుక్రవారం లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఢిల్లీలోని గురు రవిదాస్ ఆలయాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై స్థానికంగా ఉండేవారితో పాటు పంజాబ్ వంటి ఇతర ప్రాంతాల్లోని రవిదాస్ వర్గానికి చెందిన వారు నిరసన ర్యాలీలు నిర్వహించారు. వారి ఆందోళనకు మద్దతు ఇస్తూ ఆలయంతో పాటు ధ్వంసం కాబడిన సమాధులను అదే స్థానంలో నిర్మించాలని బృందాకారత్ డిమాండ్ చేశారు. తుగ్లకాబాద్లో ప్రాంతంలో ఈ నెల 10న ధ్వంసం చేయబడిన ఆలయాన్ని తనతో పాటు పార్టీ బృందం ఈ నెల 14న పరిశీలించిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలన్నింటినీ గురు రవిదాస్ సమితి సభ్యులు తమకు తెలిపారని లేఖలో పేర్కొన్నారు. ఆలయాన్ని, సమాధులను వేరొక ప్రదేశంలో నిర్మించాలని ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్తో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయని తెలిపారు. సమితి సభ్యులు చేస్తున్న ఫిర్యాదులపై ఢిల్లీ డెవలెప్మెంట్ (డీడీఏ) అధికారులు వ్యవహరిస్తున్న తీరు గర్హనీయంగా ఉందని విమర్శించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంలో బీజేపీ వ్యవహారశైలిని చూస్తుంటే వారి పక్షపాత వైఖరి స్పష్టమైందన్నారు. ఆలయ ధ్వంసానికి సంబంధించి ఒక బలమైన లీగల్ కేసు నడుస్తున్నా, పిటిషనర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, గురుదాస్ భక్తులందరూ దళిత వర్గాలకు చెందిన వారు కావడమే దీనికి కారణం కాదా అన్ని ఆమె ప్రశ్నించారు. వందల ఏండ్ల నుంచి రవి గురుదాస్ ఆలయం ఉందని, అక్కడ ఉన్న ఒక సరస్సుకు నిత్యం భక్తులు విచ్చేస్తుంటారని మంత్రికి రాసిన లేఖలో బృందాకారత్ తెలిపారు. ఆలయాన్ని సులభంగా పక్కకు మార్చేలా అప్పట్లోనే నిర్మాణం గావించబడిందని పేర్కొన్నారు. సమాధులు చెక్కుచెదరకుండా ఆలయాన్ని 400 అడుగులు పక్కకు మార్చాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సూచనకు విరుద్ధంగా డిడిఎ అధికారులు ప్రవర్తించారని విమర్శించారు. కూల్చబడిన స్థానంలో ఆలయాన్ని పునర్నిర్మించాలని భక్తులు చేస్తున్న పోరాటానికి సిపిఎం మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా బృందాకారత్ స్పష్టం చేశారు.