Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయంగా వాడుకోవటం కోసం ఈ ఏర్పాటు : రాజకీయ విశ్లేషకులు
- తమ ప్రయోజనాలు నెరవేర్చినవారికి ప్రతిఫలంగా 'సీడీఎస్'!
త్రివిధ దళాల్లో ఉన్నతాధికారుల్ని, సైన్యాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలన్న ఆలోచన 'మోడీ సర్కార్' చేస్తోందని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏ అధికారి అనుకూలంగా వ్యవహరిస్తారో వారికి ఆ 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్' పదవి కట్టబెడతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాలకులకు అనుకూలంగా పనిచేసే సైనిక అధికారులకు ప్రతిఫలం కట్టబెట్టడం కోసం ఈ పదవిని తెరమీదకు తీసుకొచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370రద్దు, రాష్ట్ర విభజన, హఠాత్తుగా 'సీడీఎస్' పదవి ఏర్పాటు...నేపథ్యంలో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
న్యూఢిల్లీ:పుల్వామా ఉగ్రదాడి ఘటన అనంతరం పాకిస్థాన్, భారత్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. జమ్మూకాశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పించే అధికరణం 370ని రద్దు చేస్తూ మోడీ సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో మరోసారి యుద్ధంపై రెండు దేశాల నేతల నుంచి మాటలు దొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. అందుకు సంబంధించిన కసరత్తు పూర్తి కావడానికి మూడు నెలల సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. దేశ రక్షణ రంగంలోని మూడు విభాగాలైన సైన్యం, నావికాదళం, వైమానిక దళాలను సమన్వయంతో నడిపించే అధినేతగా సీడీఎస్ వ్యవహరిస్తారు. ఇప్పటివరకూ ఈ బాధ్యతను మూడు విభాగాల అధిపతుల్లోని సీనియర్ అధికారి నిర్వహిస్తూ వస్తున్నారు. సీడీఎస్ నియామకం చేపట్టడానికి ముందు విధి విధానాలు ఖరారు కావాల్సి ఉన్నది. కాగా, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ను సీడీఎస్గా నియమించనున్నట్టు తెలుస్తోంది.
ఓవైపు జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడి పరిస్థితులు ఏవిధంగా పరిణమిస్తాయో ఇంకా తేలలేదు. ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలోని ప్రజలు కేంద్రం నిర్ణయం పట్ల ఏవిధంగా స్పందిస్తారన్న దానిపై స్పష్టత లేదు. కారణం.. 370 రద్దుపై పార్లమెంట్లో బిల్లు పెట్టి 12 రోజులు గడిచినా ఇంకా నిషేధాజ్ఞలు తొలగించకపోవడం. జమ్మూ ప్రాంత జిల్లాల్లో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించినా, కాశ్మీర్ ప్రాంతంలో అది ఇంకా జరగలేదు. ఆ ప్రాంతంలోని కొన్ని ల్యాండ్లైన్లను పునరుద్ధరించినట్టు అధికారులు చెబుతున్నారు. నిషేధాజ్ఞలు పూర్తిగా తొలగించినపుడే ఆ ప్రాంత ప్రజల స్పందన ఏ రూపంలో ఉంటుందనేది అర్థమవుతుంది. సరిహద్దులోని కీలక ప్రాంతంలో అనిశ్చితి నెలకొన్న వేళ ప్రధాని మోడీ సీడీఎస్పై ప్రకటన చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా, రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్ పోఖ్రాన్-2 అణు పరీక్షలు జరిపిన ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలూ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొదటి అణ్వస్త్రాన్ని ప్రయోగించరాదన్న విధానానికి భారత్ కట్టుబడి ఉన్నదని అంటూనే భవిష్యత్లో ఏం జరుగుతుందనేది ఇప్పుడే చెప్పలేమని, అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని రక్షణమంత్రి చేసిన వ్యాఖ్యలు పలు అర్థాలకు అవకాశమిస్తోంది. రాజ్నాథ్ ప్రకటన అస్పష్టంగా ఉన్నదని, దానిపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్సింఘ్వీ కోరారు.
పొరుగు దేశాలతో సరిహద్దుల్లో తలెత్తే వివాదాలపై ఏవిధంగా స్పందించాలన్నది నిర్ణయించడంలో సీడీఎస్ కీలకం కానున్నారు. సైన్యం తమ ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కోరుకోవడం సహజం. కానీ, సరిహద్దుల రక్షణ విషయంలో సమయానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలే తప్ప అందులోకీ రాజకీయాలు చొప్పించకూడదనే విజ్ఞతగల దేశ పౌరులంతా కోరుకుంటారు. ప్రస్తుతం కాశ్మీర్లో తలెత్తే పరిణామాలపై ఎప్పటికపుడు సమీక్షించి కేంద్రానికి నివేదికలివ్వడంలో సైన్యం పాత్రను కీలకంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీడీఎస్ నియామకంపై మీడియాలో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. సీడీఎస్ పదవికి ఆర్మీ చీఫ్ ముందు వరుసలో ఉన్నట్టు చెబుతున్నారు.
కాశ్మీర్ పరిణామాలపై నిఘా వర్గాలతోపాటు అక్కడి పారా మిలిటరీ దళాల అధినేతల నుంచీ కేంద్రం ఎప్పటికపుడు సమాచారం తెప్పించుకుంటుంది. దీంతోపాటు పాక్ సరిహద్దు వెంట బాధ్యతలు నిర్వహిస్తున్న సైనికాధికారుల నుంచీ సమాచారాన్ని తీసుకొని సమీక్షిస్తుంది. కేంద్రం తీసుకునే రాజకీయ నిర్ణయాలకు ఈ సమాచారమే కీలకం. 1999 కార్గిల్ యుద్ధం రావడానికి నిఘావర్గాల వైఫల్యం కూడా కారణమని దానిపై ఏర్పాటైన కమిటీ తేల్చింది. కార్గిల్ సమీక్ష కమిటీకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.సుబ్రమణ్యం నేతృత్వం వహించారు. ఐబీ, రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్(రా), సైనిక నిఘా వర్గాల మధ్య సమన్వయ లోపం ఉన్నట్టు కమిటీ తేల్చింది. సీడీఎస్ ఏర్పాటును మొదటిసారి అప్పటి వాజ్పేయి ప్రభుత్వానికి సూచించింది ఈ కమిటీనే అన్నది గమనార్హం. కమిటీ నివేదికను 2000 ఫిబ్రవరి 23న పార్లమెంట్ ముందుంచారు. కె.సుబ్రమణ్యం కుమారుడే ప్రస్తుత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్. ఎల్కె అద్వానీ నేతృత్వంలోని మంత్రుల బృందం(జీవోఎం) కూడా సీడీఎస్ను(2002లో) సూచించింది. ఆ తర్వాత 2012లో ఏర్పాటైన నరేశ్చంద్ర టాస్క్ఫోర్స్(ఎన్సీటీఎఫ్), 2016లో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డిబి శేకత్కార్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సీడీఎస్ను సూచించాయి.
కాశ్మీర్ పరిణామాలు, పాక్ సరిహద్దున ఇరు దేశాల సైన్యం చర్యలు మరోసారి ప్రపంచ దేశాల దృష్టికి వెళ్లాయి. ఓవైపు తాజా పరిణామాలపై జోక్యం చేసుకోవాలంటూ పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. శుక్రవారం ఈ అంశంపై భద్రతామండలిలోని సభ్య దేశాల చర్చలు రహస్యంగా సాగాయి. ఈ చర్చల్లో భారత్, పాక్ ప్రతినిధులకు అవకాశం కల్పించలేదు. మరోవైపు జమ్మూకాశ్మీర్పై తమ నిర్ణయం అంతర్గత అంశమని, అందులో బయటి జోక్యాన్ని అనుమతించబోమని సమితిలో భారత్ తరఫు శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.