Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూటాన్ పర్యటనలో ప్రధాని మోడీ
పారో(భూటాన్) : భారత్, భూటాన్లు నదీ జలాలను విద్యుత్ శక్తిగా మార్చుకోవడమే కాకుండా ఇరుదేశాలకు పరస్పర శ్రేయస్సుగా మార్చుకుంటున్నాయని ప్రధానమంత్రి మోడీ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం భూటాన్ చేరుకున్న మోడీ ఆ దేశ రాజధాని థింపులో భారత్ సహకారంతో నిర్మించిన మంగ్జెచ్చు హెడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయి వంటిదని అన్నారు. ఈ ప్రాజెక్టు ఇరుదేశాల మధ్య సహకారానికి నిదర్శమని పేర్కొన్నారు. ఇరుదేశాలు సంయుక్తంగా చేపట్టిన ఇతర ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భూటాన్కు భారత్ 70 శాతం నిధులను రుణం రూపంలో, 30 శాతం నిధులను గ్రాంట్ రూపంలో ఇచ్చింది. పర్యటనలో భాగంగా ముందుగా పారో విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి ఆ దేశ ప్రధాని లొటారు షెరింగ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం భూటాన్ సాయుధ బలగాలు గౌరవ వందనం చేశాయి. పారో ఎయిర్పోర్టు నుంచి ఆ దేశ రాజధాని థింపుకు వెళ్లే మార్గంలో స్థానిక ప్రజలు భారత, భూటాన్ జెండాలను పట్టుకొని మోడీకి ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రధాని హోదాలో మోడీ భూటాన్ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి కాగా, ప్రధానిగా తిరిగి ఎన్నికైన తర్వాత ఇది తొలిసారి. మోడీ ఈ పర్యటనలో భాగంగా భూటాన్ నేతలతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు జరపనున్నారని అధికారులు తెలిపారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసార్ నంగ్యేల్ వాంగ్చుక్తో మోడీ భేటీ కానున్నారు. అనంతరం ప్రఖ్యాత రాయల్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భూటాన్లో తనకు లభించిన స్వాగతంపై ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ దేశ ప్రజల ఘన స్వాగతం గుర్తుంచుకోదగినదని అన్నారు. ఇరుదేశాల సంబంధాలు మరింత దృఢతరం కావాలని ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.