Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్ని ప్రాంతాల్లో టెలిఫోన్ సర్వీసులను పునరుద్ధరించాం : అధికారులు
శ్రీనగర్, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో విధించిన ఆంక్షలను శనివారం కొంతమేర సడలించినట్టు అధికారులు తెలిపారు. దీంతో కాశ్మీర్ లోయలో జనసంచారానికి పాక్షిక వెసులుబాటు వచ్చింది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో టెలిఫోన్ సర్వీసులను పునరుద్ధరించారు. ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఆంక్షలను సడలించినట్టు వారు పేర్కొన్నారు. అయినప్పటికీ కొన్నిచోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. రహదారులపై బారికేడ్లు అలాగే ఉంటాయని, చెక్పోస్టుల వద్ద పరీక్షించిన తర్వాతే వారికి బయటి ప్రాంతాలకు అనుమతించడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఆంక్షల సడలింపుతో పలు జిల్లా కేంద్రాల్లో వాహన సంచారం పెరిగిందని, ఇతర జిల్లాలకు చెందిన క్యాబ్లు కూడా శ్రీనగర్కు వస్తున్నాయని వెల్లడించారు. జనావాసాల్లోని కొద్ది దుకాణాలను మాత్రమే శనివారం ఉదయం సమయానికి తెరచినట్లు పేర్కొన్నారు. అయితే చిన్నపాటి దుకాణాలు తెరుచుకున్నా కూడా పెద్ద వ్యాపార సముదాయాలు, ఆయిల్ బంకులు ఇంకా మూతవేసే ఉన్నాయి.
రాజ్భాగ్, జవహర్ నగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో టెలిఫోన్ సర్వీసులను పునరుద్ధరించినట్టు అధికారులు తెలిపారు. అయితే అధికప్రాంతాల్లో ఈ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ప్రముఖ వాణిజ్య కేంద్రమైన చౌక్, ఇతర కొన్ని ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. శనివారం నాటిని 17 ఎక్స్చేంజీల పరిధిలోని సర్వీసులను పునరుద్ధరించినట్టు వెల్లడించారు. ఇంకా దాదాపు 80కి పైగా ఎక్స్చేంజీలు పనిచేయడం లేదు. ఇవన్నీ కూడా కంటోన్మెంట్ ఏరియా, శ్రీనగర్ ఎయిర్పోర్టు ఏరియాల్లోనివి. మధ్య కాశ్మీర్లోని బుద్గాం, సోనామార్గ్, మణిగాం, ఉత్తర కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ల్యాండ్ లైన్ సర్వీసులను పునరుద్ధరించామని అధికారులు తెలిపారు.
కాశ్మీర్ నేత షా ఫైసల్ను విడుదల చేయండి : కేంద్రానికి 'హార్వర్డ్' అధ్యాపకులు, విద్యార్థుల అభ్యర్థన
మాజీ ఐఏఎస్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ వ్యవస్థాపకుడు షా ఫైసల్ అరెస్టుపై అమెరికాలోని ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు (అల్యూమ్నీ) ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
షా ఫైసల్ను విడుదల చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్లో సుస్థిర పరిస్థితులు నెలకొనేందుకు శాంతియుత, ప్రజాస్వామిక పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని కోరారు. కాశ్మీర్లోయలో శాంతి నెలకొల్పే క్రమంలో అక్కడి ప్రజల ప్రజాస్వామిక హక్కులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. షా ఫైసల్తోపాటు నిర్బంధంలో ఉన్న ఇతర రాజకీయ నేతలనూ విడుదల చేయాలని అభ్యర్థించారు. ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ(జేకేపీఎం)ని స్థాపించిన షా ఫైసల్ హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఈ నెల 14న షా ఫైసల్ను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసి శ్రీనగర్లోని తాత్కాలిక నిర్బంధ కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ నెదర్లాండ్స్లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు షా ఫైసల్ బయల్దేరారని, కానీ, అతన్ని ఢిల్లీలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జేకేపీఎం నేతలు చెప్పారు.
120 కేంద్ర చట్టాలు అమల్లోకి..! : బీజేపీ నేత రామ్ మాధవ్
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు అనంతరం బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ శాసన సభ రూపొందించిన 150 చట్టాలను త్వరలో రద్దు చేయబోతున్నట్టు తెలిపారు. వాటి స్థానంలోనే 120 కేంద్ర చట్టాలు జమ్మూ కాశ్మీర్లో అమల్లోకి రానున్నట్టు వివరించారు. 74వ రాజ్యాంగ సవరణను అమలు చేస్తారని, గ్రామ పంచాయతీలకు పాలన, ఆర్థికపరమైన అధికారాలను కల్పిస్తారని చెప్పారు. పరిస్థితులు కొలిక్కివచ్చిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ కాశ్మీర్కు తిరిగి రాష్ట్ర హౌదాను కల్పిస్తారని వివరించారు.
'వైద్యం అందక తల్లడిల్లుతున్నారు'
కర్ఫ్యూ విధించినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో రోగులు సరైన వైద్య సేవలందక తల్లడిల్లుతున్నారు. అత్యావశ్యకమైన ఔషధాలు తగినన్ని అందుబాటులో లేవు. కావున జమ్మూ కాశ్మీర్లో వైద్యసేవలను వెంటనే అందించాలని కేంద్రానికి 130 మంది వైద్యరంగ ప్రముఖులు, విద్యావేత్తలు ఒక లేఖ రాశారు. కర్ఫ్యూ విధించినప్పటి నుంచి వైద్యసేవల కోసం స్థానికుల పడుతున్నపాట్లను ఆ లేఖలో ఏకరువు పెట్టారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణీ ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితిని ఓ కథనం వెల్లడించింది. క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ, డయాలసిస్ పేషెంట్లూ తగిన వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని లేఖ పేర్కొంది. ఆస్తమా రోగులు ఇన్హేలర్లు లేక, అత్యావశ్యకమైన మందులు అందక నానాపాట్లు పడుతున్నారని వివరించింది. అలాగే, ఆస్పత్రిలో ఉన్నవారు తమ ఇంటికి చేరలేక వాటిలోనే చిక్కుకుపోయారు. గతంలోలాగే పిల్లలు సహా అనేక మంది యువకులు పెల్లెట్ గాయాలతో బాధపడుతున్నారు. అనేకులు ఆస్పత్రుళ్లలోనే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజల ఆరోగ్యం, జీవించే హక్కులు కాలరాయబడుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. మానవ హక్కులు, వైద్య సేవలు అందించేందుకు హామీ పడ్డ ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఔషధాల సరఫరా, వైద్య సేవలు, అంబులెన్స్ సేవలనూ నిరంతరాయంగా సర్కారు అందుబాటులో ఉంచాలని కోరారు.