Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'జెనెటిక్ ఇంజనీరింగ్'తో ఆహార దిగుబడులు పెంచుకోవచ్చు
- అడవుల నరికివేత, జనాభా పెరుగుదలతో సమస్యలు తప్పవు: వాతావరణ మార్పుపై 'ఐపీసీసీ' నివేదిక
న్యూఢిల్లీ : ఆహార ఉత్పత్తికోసం మానవుడు పెద్ద ఎత్తున అడవుల్ని నరికేస్తున్నాడనీ, ఇందుకోసం సగం భూభాగాన్ని మానవుడు ఆక్రమించేశాడనీ 'పర్యావరణ మార్పు'నకు సంబంధించి ప్రత్యేక నివేదిక హెచ్చరించింది. జనాభా ఇదేతీరుగా పెరుగుతూ పోతే...ఇప్పుడున్న 'వ్యవసాయ దిగుబడి' మానవుల ఆహార అవసరాల్ని తీర్చలేదని ఇందులో తెలిపారు. 'జెనెటిక్ ఇంజనీరింగ్' పరిజ్ఞానం ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించగలదని నివేదిక అభిప్రాయపడింది. 'ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్'(ఐపీసీసీ) ఈ నివేదికను విడుదల చేసింది. 52దేశాలకు చెందిన 107మంది పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ నివేదిక రూపకల్పనలో పాలుపంచుకున్నారు. దీంట్లో పేర్కొన్న మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి....
అడవుల నరికివేత, జనాభా విస్ఫోటనం...ఇవి రెండూ కూడా భవిష్యత్తు మానవుడికి సంక్లిష్టమైన సవాళ్లను విసురుతుంది. అత్యంత ముఖ్యమైన వనరు 'భూమి' నుంచి వచ్చే ఆహార ఉత్పత్తులు ప్రజలకు సరిపోవు. కారణం భూ వాతావరణంలో జరుగుతున్న అనూహ్యమైన మార్పులు. ముఖ్యంగా భూతాపం పెరగటం. భూమధ్య రేఖకు దిగువన ఉన్న దేశాల్లో పండ్లు, కూరగాయల దిగుబడిని దెబ్బతీస్తుంది. ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా పేదలు, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా అధిక జనాభా నివసిస్తున్న ప్రాంతాల్లోని ప్రజలు పోషకాహార లోపంతో బాధపడే పరిస్థితులు ఏర్పడతాయి.
- వాతావరణ మార్పు కారణంగా 18.3కోట్లమంది ప్రజలు ఆకలి సమస్యలో చిక్కుకుంటారని 'ఐపీసీసీ' నివేదిక అంచనావేస్తోంది.
- ఆహార పదార్థాల ధరలు నిరంతరం పెరుగుతూ, ప్రజలు పెద్ద సంఖ్యలో వాటికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
- వాతావరణ మార్పులు తోడవటం వల్ల ఆఫ్రికాలో ఆకలి సమస్యలు 20 శాతం పెరుగుతాయి.
- తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడితో కూడిన పంటల్ని సాధించాలంటే మానవుల ముందున్న ఒకే ఒక పరిష్కారం 'జెనెటిక్ ఇంజనీరింగ్'.
- జెనెటిక్ ఇంజనీరింగ్తో అభివృద్ధిచేసిన విత్తనాల్ని వ్యవసాయదారులకు ఉచితంగా అందజేయాలని నివేదిక సూచించింది.