Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలో అటవీ కార్మికుల ఆవేదన
- పది నెలలుగా నిరవధిక దీక్ష.. సీఐటీయూ మద్దతు
- అటవీశాఖ మంత్రి ఇలాకాలోనే ఈ పరిస్థితి!
చండీగఢ్ : హర్యానాలోని బీజేపీ సర్కారు అటవీ కార్మికుల సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులరైజ్ చేసే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. తమను క్రమబద్ధీకరించాలని మనోహర్లాల్ ఖట్టర్ సర్కారును గుర్గ్రామ్లోని అటవీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం దాదాపుగా గత పది నెలల నుంచి 100 మంది కార్మికులు గురుగ్రాం అటవీ శాఖ ముందు నిరవధిక దీక్షను చేస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర అటవీశాఖ మంత్రి సొంత జిల్లాలోనే కార్మికులు దీక్ష చేస్తున్నా.. తమ సమస్యల గురించి విన్నవించుకుంటున్నా.. అమాత్యులు పట్టించుకోకపోవడం గమనార్హం. వన విభాగ్ మజ్దూర్ యూనియన్ నేతృత్వంలో అటవీ కార్మికులు చేపట్టిన దీక్ష 297వ రోజుకు చేరుకున్నది. తమకు 'శాశ్వత' పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు, అటవీ శాఖ అధికారుల ఉదాసీన వైఖరిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కార్మికుల పోరాటానికి, వారి డిమాండ్లకు సీఐటీయూ మద్దతుగా నిలిచింది.
రాష్ట్రంలో అటవీశాఖతో పాటు పలు ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి హర్యానా ప్రభుత్వం పలు సందర్భాల్లో విధానాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 1988, 1993, 1996, 2003 లలో హర్యానా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హర్యానా అటవీ విభాగంలో కాంట్రాక్టు పద్దతిలో దాదాపు ఆరువేల మంది కార్మికులు పనిచేస్తున్నారనీ.. కాంట్రాక్టు విధానం రద్దు కావాలనే డిమాండ్తో 1987లో ఒక యూనియన్ను ఏర్పాటు చేశారు. కాగా, కార్మికుల పోరాటాలతో హర్యానా సర్కారు పలు సందర్భాల్లో తీసుకొచ్చిన విధానాల వల్ల రాష్ట్రంలో క్రమక్రమంగా దాదాపు నాలుగువేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించారు. చివరగా 2003లో రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులైజేషన్ పాలసీని తీసుకొచ్చింది. దాదాపు మూడు దశాబ్దాలుగా అటవీశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పటికీ కేవలం ఒక్క గురుగ్రామ్ జిల్లాలోనే ఏ ఒక్క కార్మికుడు కూడా రెగ్యులరైజ్ కాకపోవడం గమనార్హం. దీంతో అప్పటి నుంచి ఈ జిల్లాలో అటవీ కార్మికులు తమను క్రమబద్ధీకరించాలను పోరాడుతున్నారనీ సీఐటీయూ హర్యానా జనరల్ సెక్రెటరీ సత్బీర్ సింగ్ అన్నారు.జిల్లా అటవీశాఖాధికారుల వ్యవహరశైలి ప్రశ్నార్థకంగా మారిందని తెలియజేస్తూ ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి రావ్ నర్బీర్ సింగ్కు కార్మిక యూనియన్ ఒక మెమోరాండాన్ని సమర్పించింది. వారి ఉద్దేశపూర్వక చర్యల వల్ల తమకు అన్యాయం జరుగుతున్నదనీ.. తమను క్రమబద్ధీకరించాలంటూ వారు అందులో పేర్కొన్నారు.
అయితే మంత్రి కూడా అదే జిల్లాకు చెంది నవాడైనప్పటికీ కార్మికుల డిమాండ్లను పట్టించుకోలేదు. దీంతో మంత్రి తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటి వరకు తమను తాత్కాలికంగా సంతృప్తిపరిచే నిర్ణయాలు మాత్రమే జరిగాయనీ.. అయితే ఇప్పుడు మాత్రం మా ఉద్యోగాలను శాశ్వతం చేసి డిమాండ్లు పరిష్కరించే వరకూ సర్కారుకు వ్యతిరేకంగా తమ పోరాటం సాగిస్తామని వన విభాగ్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు విజరు కుమార్ అన్నారు. ఒక కాంట్రాక్టు కార్మికుడు నెలకు రూ. ఐదు నుంచి ఆరు వేల వరకు మాత్రమే జీతాన్ని పొందుతాడనీ.. అదే శాశ్వత ఉద్యోగి మాత్రం గ్రేడ్-డి పే స్కేల్ కింద రూ.24 వేలు అందుకుంటాడనీ.. ఈ లెక్కన ఒకే పనికి కాంట్రాక్టు కార్మికుడు ఎంతగా నష్టపోతున్నాడో అర్థం చేసుకోవచ్చని విజరు అన్నారు. అధికారులు, అటవీశాఖ విభాగం నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగానే కార్మికులు సాగిస్తున్న పోరాటమని సత్బీర్ సింగ్ తెలిపారు.