Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమచల్ప్రదేశ్లో 47 మంది మృతి
- ఉత్తరఖండ్లో 16మంది గల్లంతు
న్యూఢిల్లీ: హిమచల్ప్రదేశ్ను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల వల్ల పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో 47మంది ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది తీవ్రగాయాలపాలయ్యారు. మృతుల్లో ఎనిమిది మంది సిమ్లాకు చెందిన వారుండగా.. కులు, సిర్మార్, సోలన్, చాంబా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మంది, యునా, లహాల్-స్పిటి జిల్లాల్లో ఇద్దరు మృతిచెందారు. సిమ్లాలో మృతిచెందిన వారిలో ఇద్దరు నేపాలీయులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, వరదల తీవ్రతతో సిమ్లా, కులు జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకూ సెలవులు ప్రకటించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల వరద నీరు ఇండ్లు, రహదారులను ముంచెత్తింది. వరద ఉధృతి కారణంగా కులు సమీపంలోని వంతెన కొట్టుకుపోయింది. సట్లెజ్ నది పోటెత్తడంతో ముందుజాగ్రత్తగా సట్లెజ్ జల విద్యుత్ నిగమ్కు చెందిన దేశంలోని అతిపెద్ద హైడ్రో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఉత్తరఖండ్లోనూ..
ఉత్తరఖండ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో భారీగా వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో జిల్లాలోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకుని ఎనిమిది మంది గల్లంతైనట్టు 'స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్' (ఎస్ఈవోసీ) తెలిపింది. మెజిస్ట్రేట్ ఆశీష్ చౌహాన్ ప్రభావిత గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉత్తరకాశీ, ఉద్దమ్ సింగ్ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. డెహ్రాడూన్లోని ఓ చిన్నపాటి వంతెనపై భారీగా ప్రవహిస్తున్న నీటిని లెక్కచేయకుడా కారులో వంతెన దాటే ప్రయత్నం చేసిన ఓ మహిళ కారుతో సహా కొట్టుకుపోయింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (ఎస్ఈవోసీ).. ప్రభావిత గ్రామాల్లోకి సహాయక బృందాలను పంపించినప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సహాయక చర్యల్లో జాప్యం జరుగుతున్నది. కొండచరియలు విరిగిపడే పడే అవకాశముండటంతో రిషికేశ్-బద్రినాథ్, కేదర్నాథ్, గంగోత్రి వంటి ప్రధాన రహదారులను పలు ప్రాంతాల్లో మూసివేశారు.