Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వేచ్ఛను ఒక మార్గంగా వాడుతున్నారు : సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్
-పెహ్లూఖాన్ కేసు తీర్పుపైనా విచారం
ముంబయి : ప్రస్తుతం భిన్నంగా ఆలోచించేవారిపై విషం చల్లడానికి స్వేచ్ఛ ఒక మార్గంలా ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన కళా రంగంలో స్వేచ్ఛ గురించి మాట్లాడారు. చంద్రచూడ్ మాట్లాడుతూ.. 'మానవాళి సామూహిక పురోగతికి కళ అన్ని దిశలలో విస్తరించేందుకు స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛను అణచివేతకు గురైనప్పుడు వ్యక్తుల, రాజ్యం ద్వారా అది అబద్ధాలను వ్యాపింపజేసే ప్రమాదం ఉంది. నేటి సమాజంలో తమకనుగుణంగా లేని వ్యక్తులపై అసహనం పెరిగిపోతున్నది. భిన్నంగా మాట్లాడే, ఆలోచించే, దుస్తులు ధరించే వారిపై విషం చల్లడానికి స్వేచ్ఛను ఒక మార్గంలా వాడుకుంటున్నారు' అని ఆయన తెలిపారు. అణగారిన వర్గాల స్వేచ్ఛకు సంబంధించిన కథాంశాలతో తీసిన చిత్రాలపై రాజ్యం నిషేధం విధిస్తూనే ఉన్నదనీ, అది నాటి 'బ్యాండిట్ క్వీన్' మొదలు రెండు నెలల క్రితం బెంగాల్ సర్కారు నిషేధించిన 'భూభిష్యోటర్ భూత్' వరకు కొనసాగుతూనే ఉన్నదని అన్నారు. కళారంగంపైనే గాక కళాకారులపైనా దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూభిష్యోటర్ భూత్ చిత్రాన్ని నేటి రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తీశారనీ, కానీ నిజాలు వెల్లడిస్తే తట్టుకునే స్థితిలో ప్రస్తుత రాజకీయ నాయకుల్లేరని చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెహ్లూఖాన్ మూకదాడి కేసు విషయంలో తీర్పుపై చంద్రచూడ్ స్పందిస్తూ.. ఈ కేసులో విచారణ తనకు విచారం కలిగించిందని అన్నారు. నాణ్యత లేని విచారణ కారణంగానే ఇలాంటి కేసుల్లో దోషులు తప్పించుకుంటున్నారని తెలిపారు. ఈ తరహా కేసుల్లో పోలీసులు, న్యాయస్థానాలు సరైన సమయంలో స్పందిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.