Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నావో బాధితురాలి ప్రమాద ఘటనపై విచారణ గడువు పొడిగింపు
- బాధితురాలి తరఫు న్యాయవాదికి రూ.5 లక్షల పరిహారం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో లైంగికదాడి బాధితురాలి కారు ప్రమాద ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తునకు మరో రెండు వారాలు గడువు పెంచుతూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితురాలి వాంగ్మూలాన్ని ఇంకా నమోదు చేయలేదనీ, ప్రమాదంలో గాయపడిన న్యాయవాది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నదనీ సీబీఐ కోర్టుకు తెలిపింది. అందువల్ల విచారణకు మరో నాలుగు వారాల సమయం కావాలని సీబీఐ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో విచారణ గడువును రెండు వారాలు పొడిగించేందుకు కోర్టు అంగీకరించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 6కు వాయిదా వేసింది. అలాగే ప్రమాదంలో గాయపడిన బాధితురాలి న్యాయవాదికి తక్షణమే రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితురాలి తరఫు న్యాయవాది, బాధితురాలు, ఆమె బంధువులు ప్రయాణిస్తున్న కారును నెంబరు ప్లేటుకు గ్రీజు పూసి వున్న ట్రక్కు ఢ కొన్న ఘటనను అత్యున్నత న్యాయస్థానం సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే. విచారణను రెండు వారాల్లో పూర్తిచేయాల్సిందిగా తొలుత సీబీఐని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. మరో 20 మంది అదనపు అధికారులను నియమించగా, మొత్తం 25 మంది అధికారులు ప్రమాదఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 17 ప్రాంతాల్లో సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది. ప్రమాద ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఉన్న సీతాపూర్లోని జైలును కూడా సీబీఐ బృ:దం సందర్శించింది.