Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్లోని గ్రామ పంచాయతీ హుకూం
పాట్నా : అవివాహిత యువతులు, బాలికలు ఫోన్ వినియోగించొద్దని బీహార్లోని ఓ గ్రామ పంచాయతీ హుకూం జారీ చేసింది. అంతేకాదు, బాలికలు, మహిళలు రాత్రిపూట మలవిసర్జనకూ బయటకెళ్లొద్దని ఆదేశించింది. పెండ్లి వేడుకల్లో, బరాత్లలో డ్యాన్స్ చేయొద్దనీ ఆంక్షలు విధించింది. మదుబని జిల్లాలోని హత్తాపూర్ పార్సా గ్రామ పంచాయతీ ఆదివారం ఈ నిర్ణయాలు చేసింది. అంతేకాదు, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. పెండ్లి వేడుకల్లో బాలికలు, మహిళలు నృత్యం చేస్తే వారిని సామాజికంగా బహిష్కరిం చాలని ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన బాలిక కుటుంబానికి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వందలాది మంది గ్రామీణుల ఆమోదంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని గ్రామ సర్పంచ్ యోగేంద్ర మందల్ తెలిపారు. తల్లిదండ్రులు, సంరక్షకుల సమక్షంలోనే బాలికలు తమ బంధువులతో ఫోన్లో మాట్లాడాలని అన్నారు. ఈ నిబంధనల అమలు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఉపసర్పంచ్ అఫాక్ ఆలం చెప్పారు. బాలికలు, యువతుల ఫోన్ దుర్వినియోగంతో ఏర్పడే 'సామాజిక రుగ్మతల'ను అరికట్టేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించడం గమనార్హం.
దీనిపై స్పందిస్తూ.. ఫోన్ వినియోగించకుండా బాలికలపై నిషేధం విధించే అధికారం పంచాయతీకి ఉండదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్దేవ్ కామత్ అన్నారు. ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఎవరైనా ఒక బాలిక ఫిర్యాదు చేస్తే గ్రామపంచాయతీ నిర్ణయాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు అధికారి తెలిపారు. గతం లోనూ ఈ రాష్ట్రంలో బాలికలు జీన్స్ ధరించొద్దని, 'రెచ్చగొట్టే' దుస్తులు వేసుకోవద్దని పదిపైనే జిల్లాల్లోని గ్రామాల్లో నిషేధాలు విధించడం గమనార్హం. మహిళా సాధికారత అని ఓ వైపు మాట్లాడుతూనే.. మరోవైపు వారిని ఇంటి నుంచి బయటకెళ్లకుండా గ్రామ పంచాయతీలే నిషేధించే పరిస్థితులు చోటుచేసుకుంటుండటం గమనార్హం. మలవిసర్జనకూ బయటకెళ్లొద్దన్న గద్దింపునకు లోనవుతున్న బాలికలు ఫిర్యాదు చేస్తేగానీ స్పందించలేమని అధికారులు చెబుతుండటంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక కట్టుబాట్లే గ్రామీణుల ఆలోచనలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్న విషయం తెలిసి కూడా ఇలాంటి వ్యవహారాలను నియంత్రించకుంటే పెడధోరణులు పెరిగే అవకాశమున్నదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.