Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాచల్, ఉత్తరాఖండ్లలో 68 చేరిన మృతులు
- ప్రమాదకర స్థాయిలో నదుల ప్రవాహం
న్యూఢిల్లీ: నిన్నమొన్నటిదాకా దక్షిణాదిని ముంచెత్తిన భారీ వర్షాలు, వరదలు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్లలో వరదల్లో ముంపునకు గురై చనిపోయిన వారి సంఖ్య 68కి చేరగా.. 42 మంది గల్లంతయ్యారు. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రజలు వాటికింద చిక్కుకున్నారు. భారీ సంఖ్యలో ఇండ్లు, చెట్లు నేలకూలాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయినిదాటి ప్రవహిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో గంగా, యమునా, ఘాగ్రా నదుల ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది.
సట్లేజ్ నదిపై కొట్టుకుపోయిన వంతెన
హిమాచల్ప్రదేశ్లో వర్షబీభత్సం కొనసాగుతున్నది. వరదల్లో చనిపోయిన వారిసంఖ్య సోమవారం నాటికి 28కి చేరింది. 22 మంది గల్లంతయ్యారు. ఈ సీజన్లో వరదల కారణంగా రాష్ట్రంలో చనిపోయినవారి సంఖ్య 43కు చేరడం గమనార్హం. సట్లేజ్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సిమ్లాలోని చాంబా ప్రాంతంలో ఓ వంతెన కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. కులు-మనాలిని కలిపే జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
పంజాబ్లో: భారీ వర్షాల కారణంగా నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని 8 జిల్లాలు నీటమునిగాయి. యమున, సట్లేజ్, బియాస్ నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. హర్యానాలోని హథ్నీకుంద్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది.
ఉత్తరాఖండ్లో: వరదల్లో చనిపోయిన వారిసంఖ్య 40కి చేరింది. వర్షాలకు చాలా చోట్ల ఇండ్లు కొట్టుకుపోయాయి. ఉత్తరకాశీ జిల్లాలో మోరీ సమితిలో వరదల్లో కొట్టుకుపోయి 17 మంది చనిపోయారు. హరిద్వార్, రిషికేశ్ వద్ద గంగానది ఉధృతంగా ప్రవహిస్తున్నది. కొండచరియలు విరిగిపడటం వల్ల బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో: దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులంతా సహాయ చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
జమ్మూకాశ్మీర్లో: తావి నదికి వరద ఉద్ధతి పెరిగింది. వరదలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. హెలికాఫ్టర్ ద్వారా వైమానిక సిబ్బంది వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
కేరళలో: వరదలకు మృతిచెందిన వారి సంఖ్య సోమవారం నాటికి 121కి చేరుకోగా.. గల్లంతయిన వారి సంఖ్య 40కి చేరింది. వరదలకు అత్యధికంగా మలప్పురం జిల్లాలో 50 మంది, కోజికోడ్లో 17 మంది, వయనాడ్లో 12 మంది, కన్నూర్, త్రిసూర్ లో 9 మంది చొప్పున చనిపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా 805 సహాయక పునరావాస శిబిరాల్లో 1,29,517 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వరదలకు మొత్తం 1,186 ఇండ్లు పూర్తిగా నేలమట్టమ య్యాయనీ, 12,761 నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు.