Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్పై ట్వీట్లుచేసినందుకు ఢిల్లీ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్
- నా వ్యాఖ్యలు తప్పని భావిస్తే.. సమగ్ర దర్యాప్తు నిర్వహించండి
- కాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన నిజమే : సమర్థించుకున్న విద్యార్థిని
న్యూఢిల్లీ, శ్రీనగర్ : జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు, కాశ్మీరీ యువతి షెహ్లా రషీద్పై క్రిమినల్ కేసు నమోదైంది. జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారత ఆర్మీ దళాలు కాశ్మీరీలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటూ ఆమె సామాజిక మాధ్యమంలో చేసిన ట్వీట్ల నేపథ్యంలో ఢిల్లీ న్యాయవాది సుప్రీంకోర్టు ఆమెపై కేసు నమోదుచేశారు. భారత ప్రభుత్వంపై, ఆర్మీపై ఆధారంలేని ఆరోపణలు ఆమె చేశారనీ, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఆమె చేసిన వ్యాఖ్యలపై భారత ఆర్మీ తీవ్రంగా స్పందించింది. ఆమె వ్యాఖ్యలు అర్థరహితమనీ, కాశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయని పేర్కొంది. షెహ్లా వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపింది. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలను షెహ్లా రషీద్ సమర్థించుకున్నారు. ఆ వ్యాఖ్యలు తప్పని భావిస్తే.. సమగ్రదర్యాప్తు నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు. తనను అరెస్టు చేయాలని వచ్చిన డిమాండ్పైనా ఆమె తీవ్రంగా స్పందించారు. 'నా అరెస్టు అంశంతో ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘన నుంచి దృష్టిని మళ్లించవద్దు. దేశ సేవ కోసం ఈ ఉల్లంఘనలు జరగటంలేదు.. అధికారపార్టీ రాజకీయ ఎజెండా సేవలో జరుగుతున్నాయి' అని ఆమె పేర్కొన్నారు. 'నేను సాధారణ కాశ్మీరీ యువతిని. అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నా అరెస్టు విశేషమేమీ కాదు. పోలీసులు ప్రయోగించిన పెప్పర్ గ్యాస్ కారణంగా 65 ఏండ్ల వృద్ధుడు అక్కడ చనిపోయాడు. భద్రతబలగాల కిరాతకానికి 17 ఏండ్ల బాలుడు మొదటి బాధితుడు. దీనితో పోలిస్తే.. నా అరెస్టు ఎంత? అని షెహ్లా పేర్కొన్నారు. తాను చేసిన ట్వీట్లన్నీ అక్కడి ప్రజలతో జరిపిన సంభాషణల ఆధారమేనని తెలిపారు.
ఆమె చేసిన ఆరోపణలు ఏమిటి?
కాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదనీ, ఆర్మీ ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నదనీ, యువకులను అర్థరాత్రి సమయంలో ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్తున్నారని, పలువురిని గృహనిర్భందానికి గురిచేస్తున్నారని సామాజిక మాధ్యమంలో షెహ్లా రషీద్ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో నిత్యవసరాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని, మిలిటరీ బలగాలు హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇండ్లల్లోకి ఆర్మీ జవానులు చొరబడి యువకుల్ని అకారణంగా తీసుకెళ్తున్నారని తెలిపారు.
'జమ్మూ కాశ్మీర్లో మీడియా ప్రసారాలు నిలిపివేశారు. మందుల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తున్నది. సమాచార వ్యవస్థ పూర్తిగా స్థంబించిపోయింది. ఎలాంటి సమాచారం స్థానికులకు చేరడం లేదు. అతికొద్ది మందికి మాత్రమే టీవీ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి''పారామిలిటరీ బలగాలు రాత్రి సమయాల్లో ఇండ్లల్లోకి ప్రవేశించి యువకుల్ని అక్రమంగా నిర్బంధిస్తున్నారు. ఒక మైక్ వారి దగ్గర పెట్టి వారి అరుపుల్ని ఆ ప్రాంతంలోని వారికి వినిపిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి భయానక వాతావరణం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఉన్నది' అని షెహ్లా రషీద్ ఆరోపించారు.