Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడులు తెరిచారు.. హాజరు అంతంతే
- కాశ్మీర్ పరిస్థితులు ఆందోళనకరం : తల్లిదండ్రులు
- ఆంక్షలు సడలించినా పూర్తిగా తెరుచుకోని పాఠశాలలు
శ్రీనగర్ ,న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్లో విధించిన ఆంక్షల నేపథ్యంలో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షలను కొద్దిమేర సడలించినా ప్రజలు బయట స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు అనువుగా ఆంక్షలను సోమవారం సడలించారు. అయినా బడికి వెళ్లేందుకు విద్యార్థులు జంకుతున్నారు. బయటకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని వారి తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. పాఠశాలలు తెరుచుకున్నా విద్యార్థులు వెళ్ళలేదు. ఉపాధ్యాయులు మాత్రం హాజరయ్యారు. విద్యార్థులు రాకుండా వారు మాత్రం ఏం చేస్తారు.. చేసేదేం లేక ఖాళీగా కూర్చొని సాయం త్రం ఇంటికి వెళ్లిపోయారు. శ్రీనగర్ పట్టణంలోని 190 పాఠశాలలు తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేశా మని అధికారులు చెబుతున్నారు. కాశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో భద్రతా బలగాలను కూడా మోహరించామని తెలిపారు. అయితే గత రెండు రోజులుగా కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసన ర్యాలీలు జరుగుతు న్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను బడికి పంపేందుకు తల్లింద్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో నగరంలోని అనేక ప్రయివేటు పాఠశాలలు వరుసగా 15వ రోజు కూడా మూతపడే ఉన్నాయి. బెమీనా ప్రాంతంలోని పోలీసు పబ్లిక్ స్కూల్, కొన్ని కేంద్రీయ విద్యాలయాల్లో మాత్రమే విద్యార్థులు కొంతమేర హాజరయ్యారు. కాశ్మీర్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఓ విద్యార్థి తండ్రి ఫరూక్ అహ్మద్ మాట్లాడుతూ 'బయట పరిస్థితులు చాలా అనిశ్చితి తో కూడుకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను పాఠశాలకు పంపించేంత సాహస నిర్ణయం తీసు కోలేం' అన్నారు. పట్టాన్, పల్హాలాన్, సింగ్పోర, బారాముల్లా, సోపూర్ పట్టణాల్లో ఆంక్షల సడలింపు లేదని అధికారులు చెబుతున్నారు. శ్రీనగర్ జిల్లాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతాల్లో కొన్ని పాఠశాలలు తెరుచుకున్నా యనీ, కానీ గత రెండు రోజుల్లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఓల్ట్ సిటీలో పాఠశాలలు మూసే ఉంచా మని అన్నారు. సోమవారం నుంచి పాఠశాలలు తెరవడంతో పాటు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొం దించారు. శ్రీనగర్లో శాంతిభద్రతలు అదుపులో ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లు తొలగించారు. కాశ్మీర్ లోయలోని మార్కెట్లు ఇంకా తెరుచుకోలేదు. ప్రభుత్వ రవాణా వ్యవస్థ అంతగా సాగట్లేదు. కొన్ని ప్రయివేటు వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగు తున్నాయి.
అమిత్షాతో దోవల్ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్షాతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్దోవల్ సోమవారం భేటీ అయ్యారు. పార్లమెంట్లోని నార్త్ బ్లాక్లో జరిగిన ఈ సమావేశానికి హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాశ్మీర్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత దోవల్ అమిత్ షాతో సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఆయన దాదాపు 10 రోజులపాటు కాశ్మీర్లో పర్యటించారు. రాష్ట్రంలోని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. సమావేశం అనంతరం బయటకు వచ్చిన దోవల్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే ప్రధానంగా కాశ్మీర్లోని శాంతిభద్రతలపై చర్చ జరిగినట్టు సమాచారం.
వారంతా దేశద్రోహులే : ప్రగ్యాసింగ్
370 అధికరణం రద్దుపై బీజేపీ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించేవారంతా దేశభక్తులు కాదని అన్నారు. '370, 35(ఏ) రద్దును స్వాగతించేవాళ్లు ఈ దేశానికి గర్వకారణం. ప్రధాని మోడీ, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా చేసిన పనిని చూసి గర్వపడేవాళ్లు ఈ దేశంలో నిజమైన దేశభక్తులు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేవాళ్లు దేశభక్తులు కాదు' అని వ్యాఖ్యానించారు. రెండ్రోజుల క్రితం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆమె ఈ విధంగా స్పందించారు. ఆర్టికల్ 370ని తీసుకొచ్చిన దివంగత ప్రధాని నెహ్రూను నేరస్థుడుగా చిత్రీకరిస్తూ శివరాజ్సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై ప్రగ్యాసింగ్ స్పందిస్తూ.. 'మన మాతృభూమిని గాయపరిచేవాళ్లు, దేశాన్ని విభజించాలనుకునేవాళ్లు నేరస్థుల కిందే లెక్క' అని వ్యాఖ్యానించారు.
కాశ్మీరీల పెండ్లిళ్లపైనా ఆంక్షల ప్రభావం
కేంద్రం విధించిన ఆంక్షల నేపథ్యంలో కాశ్మీరీ జంటలు అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. మితవ్యయంతో సాధారణ పెండ్లి చేసుకుంటున్నారు. ఈ ఆంక్షలు ప్రస్తుత కాశ్మీరీ సంప్రదాయ వివాహాల సీజన్పై తీవ్రంగా ప్రభావం వేస్తున్నాయి. మటన్ అమ్మకందారులు, వాజ్వాన్(కాశ్మీరీ సాంప్రదాయ వంటకాలు) వంటవాళ్లు, ఆభరణాలు, వస్త్ర వ్యాపారులు, పెండ్లి కార్యక్రమాలతో ఆర్జించే ఇతరులు కేంద్రం విధించిన ఆంక్షలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఘనంగా వివాహం జరిపించాలనుకున్న కాశ్మీరీ కుటుంబాలు ఈ ఆంక్షల వల్ల మితవ్యయంలోనే కానిచ్చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆహ్వానించిన బంధు మిత్రులకూ వాలిమా(విందు)ను రద్దు చేస్తున్నట్టు ప్రచురితమవుతున్న దినపత్రికలు, స్థానిక ఛానెళ్లలో ప్రకటనలిస్తున్నారు. కాశ్మీరీల సౌకర్యార్థం కొన్ని సంస్థలు ఉచితంగానే ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాజ్వాన్ వంటమనిషి ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ.. 'సాధారణంగా ఒక పెండ్లి వేడుకకు ఆరు నుంచి ఎనిమిది వందల మంది అతిథులు వస్తుండేవారు. కానీ, నేడు ఆ సంఖ్య 150 నుంచి 200కు పడిపోయింది.
దీంతో నా సంపాదన 70శాతం తగ్గింద'ని వాపోయారు. మటన్ వ్యాపారి మొహమ్మద్ అల్తాఫ్ ఘనీ స్పందిస్తూ.. 'పెండ్లి కార్యక్రమాలకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల మాంసాన్ని సరఫరా చేసేవాడిని. కానీ, దాని డిమాండు నేడు రెండు క్వింటాళ్లకు తగ్గింద'ని అన్నారు. బంగారు ఆభరణాల కొనుగోళ్లూ 50శాతం పడిపోయాయని వ్యాపారి మొహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. అతిథుల సంఖ్య తగ్గడంతో టెంట్లు అసలే అవసరం లేకుండా పోయాయని, మా లాంటివారి వ్యాపారం శూన్యంగా మారిందని టెంట్లు, డెకరేషన్లు వేసే బిలాల్ అహ్మద్ రాథర్ అన్నారు.