Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో భారీ వరదల ప్రభావం
- తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు
- తగ్గిన దిగుబడి.. పంచదార ఉత్పత్తిపై ప్రభావం
ముంబయి : కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నది. తీవ్రస్థాయిలో వరదలు ముంచెత్తడంతో పట్టణాలు, గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. మరోపక్క, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఇది పెను ప్రభావాన్ని చూపింది. ప్రత్యేకించి చెప్పాలంటే చెరుకు పరిశ్రమకు పేరుగాంచిన పశ్చిమ మహారాష్ట్రలో రైతన్నలు భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదురుచూశారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి.. నెలల పాటు కష్టించి పండించిన పంటను వరదలు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో తమ కష్టం, పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైపోయిందని చెరుకు రైతన్నలు లబోదిబోమంటున్నారు. 'మహా'సర్కారు ఆర్థికంగా ఆదుకుంటే కానీ తాము ఈ కష్టం నుంచి గట్టెకలేమని వారు వాపోతున్నారు.
సర్కారు ఆదుకోకపోతే అంతే..!
పశ్చిమ మహారాష్ట్రలో ముఖ్యంగా కొల్హాపూర్, సంగ్లీ, సతారా జిల్లాలు చెరుకు పరిశ్రమకు పేరుగాంచాయి. ఇక్కడి రైతులు చెరుకు పంటపై ఎక్కువ శ్రద్దను కనబర్చి పంటలను పండిస్తారు. అందుకే ఈ మూడు జిల్లాల్లో అత్యధికంగా 53 చక్కెర మిల్లులు ఉన్నాయి. అయితే భారీవర్షాలు తెచ్చిన నష్టం.. రైతన్నలకు కన్నీరునే మిగిల్చాయి. ' గతేడాది నేను ఒక ఎకరంలో అత్యధికంగా 141 టన్నుల చెరుకు దిగుబడిని రాబట్టాను. ఈ ఏడాది 200 టన్నులు చెరుకు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాను. కానీ, వరదలు నా పంటను నాశనం చేశాయి. ఈ పంట కోసం నేను రూ.1.20 లక్షలు ఖర్చు చేశాను. పంట సాగుపై అధ్యయనం కూడా చేశాను' అని కొల్హాపూర్లోని బువచే వతర్ గ్రామానికి చెందిన సచిన్ అశోక్ పాటిల్(28) తన బాధను వెలిబుచ్చారు. ఇది బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు ఏబీఎం పూర్తి చేసిన యువ ఔత్సాహిక రైతు వేదన. సచిన్లాగే మరెందరో రైతులు ఉన్నారు. వారి పంటలు కూడా భారీ వరదల్లో మునిగిపోయాయి. 30 ఎకరాల్లో చెరుకు పంట సాగు చేసిన అశోక్ చౌగులే.. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తాను తీసుకున్న రుణాలను తన జీవితకాలంలో చెల్లించలేనని వాపోయారు.
పంచదార ఉత్పత్తిపై ప్రభావం
కాగా, పలు జిల్లాల్లో చెరుకు పంటలు వరదల్లో మునిగిపోవడంతో ఈ ఏడాది పంచదార ఉత్పత్తి 30శాతం నుంచి 35శాతం తగ్గుతుందని అతిపెద్ద చక్కెర మిల్లుల్లో ఒకటైన దత్త షుగర్ మిల్లు చైర్మెన్ గణపతిరావ్ పాటిల్ అన్నారు. చెరుకు పరిశ్రమ పైనే ఆధారపడిన కొల్హాపూర్.. గతేడాది 56 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. అయితే ఈ ఏడాది అది భారీగా తగ్గిపోనున్నది. చెరుకు రైతన్నలు తీవ్రంగా నష్టపోవడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో మహారాష్ట్ర సర్కారు పూర్తిగా రుణమాఫీని చేయాలని మాజీ ఎంపీ, రైతు సంఘం నాయకుడు రాజు శెట్టి సూచించారు. చెరుకు పరిశ్రమ మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. గతేడాది రైతన్నలకు రూ. 25 వేలకోట్లకు పైగా సహాయాన్ని రాష్ట్ర సర్కారు చెల్లించింది. అయితే ఈ సారి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆర్థికంగా ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.