Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40వేల మంది మెడికోలకు ప్రయోజనం
న్యూఢిల్లీ : దేశంలోని ప్రయివేటు మెడికల్ కళాశాలల్లో ఇంటర్న్షిప్ పీరియడ్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు స్టైఫండ్ చెల్లించాలంటూ భారత వైద్య విద్య నియంత్రణ బోర్డు ఆదేశించింది. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇంటర్న్షిప్ చేసే విద్యార్థులకు మాత్రమే రూ.6 వేల నుంచి రూ.20 వేల మధ్య స్టైఫండ్ లభించేది. అయితే తాజా నిర్ణయంతో దేశంలోని దాదాపు 40 వేల మంది మెడికోలు ప్రయోజనాన్ని పొందనున్నారు. ఈ ప్రతిపాదనకు భారత వైద్య మండలి- బోర్డ్ ఆఫ్ గవర్నర్స్(ఎంసీఐ-బీఓజీ) ఇటీవలే ఆమోదం తెలిపింది. దీనిపై ఇతర విధివిధానాలు త్వరలో పూర్తి కానున్నాయి. ప్రయివేటు, ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థుల మధ్య అంతరాయాన్ని దూరం చేయడమే తాజా ప్రతిపాదన అసలు లక్ష్యమని ఎంసీఐ-బీఓజీ సీనియర్ సభ్యుడు ఒకరు తెలిపారు. ' ఒక ప్రయివేటు మెడికల్ కాలేజీ విద్యార్థి.. ఆ కాలేజీ ఆస్పత్రిలోనే ఇంటర్న్షిప్ చేస్తే సదరు మెడికోకు హాస్పటల్ స్టైఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. అలా కాదని వేరొక ఆస్పత్రిలో ఇంటర్న్షిప్ చేస్తే ఆ విద్యార్థికి స్టైఫండ్ అందదు' అని ఓ అధికారి స్పష్టం చేశారు. ఇంటర్న్షిప్ పీరియడ్లో తమకూ స్టైఫండ్ చెల్లించాలంటూ గత కొంత కాలంగా ప్రయివేటు కళాశాలల్లోని ఎంబీబీఎస్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 240 ప్రయివేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి.