Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్లుగా ఎదురుచూస్తున్న అసోం తేయాకు కార్మికులు
- వేతన కమిటీతో బీజేపీ ప్రభుత్వం కాలయాపన
కోల్కతా : అసోంలోని తేయాకు తోటల్లో పనిచేస్తున్న 50లక్షల మంది కార్మికులు వేతన సవరణ కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. రోజువారి వేతనం రూ.167నుంచి రూ.351కి పెంచుతామని బీజేపీ నాయకులు గతంలో ఎన్నికల వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 'అసోం కనీస వేతన కమిటీ'ని ఏర్పాటుచేసి చేతులు దులుపుకున్నారు. ఈ కమిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కార్మికసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉందన్న చందంగా పరిస్థితి తయారైందని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు.
తేయాకు ఉత్పత్తిదారులకు, కార్మికులకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రభుత్వం, రోజువారి వేతనాన్ని మధ్యంతర పెంపుగా రూ.30 చేసి అక్కడితో ముగించారు. ఈ మధ్యంతర పెంపుతో ఎన్నాండ్లు సమస్యను సాగదీస్తారు, తమ సమస్య ఎన్నటికి పరిష్కారమవుతందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక అనిశ్చిత వాతావరణంలో బతుకులు వెళ్లదీస్తున్నామని వారంతా ఆవేదన చెందుతున్నారు. అసోం తేయాకు తోటల్లో పనిచేస్తున్న కార్మికుల్లో 60శాతం మహిళలు ఉన్నారు. వీరి డిమాండ్ నెరవేరుస్తామనీ, వేతన సవరణ చేపడతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.