Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామిక దేశంలో మెజారిటీ నియంతృత్వం తగదు : అమర్త్యసేన్
న్యూఢిల్లీ: కాశ్మీర్ పట్ల ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవహరరించిన తీరు వల్ల భారతీయుడిగా గర్వపడలేనని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారత్ పట్ల ఉన్న మంచి అభిప్రాయం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. ప్రజాస్వామిక విలువల కోసం మనం ఎంతో చేశాం. పాశ్యాత్యేతర ప్రజాస్వామిక దేశాల్లో భారత్ మొదటిదని అమర్త్యసేన్ గుర్తు చేశారు. ప్రపంచంలో ఎన్నో అత్యాచారాలు జరిగాయని అమర్త్యసేన్ అన్నారు.
కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి చాలా దేశాలు మద్దతు తెలపడంలో ఆశ్చర్యమేమీ లేదని ఆయన అన్నారు. మెజారిటీ నియంతృత్వం చాలా దేశాల్లో ఉన్నదని ఆయన గుర్తు చేశారు. కాశ్మీర్ విషయంలో భారత్లోని ఇతర ప్రాంతాల అభిప్రాయాలను కోరుతున్నారు. కానీ, కాశ్మీరీల అభిప్రాయాలను తెలుసుకోవడం లేదని అమర్త్యసేన్ విమర్శించారు. ఇలాంటి విధానం వల్ల మెజారిటీకీ, మానవ హక్కులకూ మధ్య వైరుధ్యమేర్పడుతుందని ఆయన అన్నారు. 370 రద్దుకు ముందు, ఆ తర్వాత కాశ్మీర్లో పెద్దసంఖ్యలో భద్రతా చర్యలు చేపట్టి అక్కడి ప్రధాన పార్టీల నేతల్ని నిర్బంధించడం, జైళ్లలో పెట్టడాన్ని అమర్త్యసేన్ తప్పుపట్టారు. ఈ చర్యలు మన దేశాన్ని 200 ఏండ్లు పాలించిన బ్రిటీష్ కాలాన్ని గుర్తు చేస్తున్నాయని అమర్త్యసేన్ అన్నారు. వలస వారసత్వానికి వెళ్తామని ఊహించలేదని ఆయన అన్నారు. అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం కల్పించినపుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనగలుగుతుందని అమర్త్యసేన్ హితవు పలికారు.