Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో సమ్మె షురూ
- ఎఫ్డీఐ, ప్రయివేటీకరణ... నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికుల ఆందోళన
- 41 ఫ్యాక్టరీల్లో నిలిచిన ఉత్పత్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ/కంది
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు దిగారు. రక్షణరంగాన్ని నిర్వీర్యం చేసే చర్యల్ని మోడీ సర్కార్ వెనక్కితీసుకోవాలని కార్మికసంఘాల నేతలు డిమాండ్ చేశారు. వివిధ నగరాల్లో ఉన్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న 82వేల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్ని ప్రయివేటీకరణ, 100శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి...ఇవ్వాలన్న మోడీ సర్కార్ నిర్ణయాల్ని కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వర్గాలకు, కార్మిక, ఉద్యోగ సంఘాలకు మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో, మంగళవారం నుంచి నెలరోజులపాటు సమ్మె జరుపుతామని వివిధ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మొదటిరోజు సమ్మెలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా పలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అంతా నిలిచిపోయింది.
పూణెలో ఉన్న మూడు ఫ్యాక్టరీల్లోని సిబ్బంది అంతా సమ్మెకు దిగారు. ఇక్కడ పనిచేస్తున్న 7వేలమంది సిబ్బంది మోడీ సర్కార్ విధానాల్ని వ్యతిరేకిస్తూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. సమ్మె నేపథ్యంలో ఖాద్గీలోని (మహారాష్ట్ర) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ బలగాల్ని రంగంలోకి దిగి సమ్మెను అడ్డుకునే ప్రయత్నం చేసింది. మూడు ప్రధాన కార్మికసంఘాలు....ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం), ఇండియన్ నేషనల్ డిఫెన్స్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎన్టీయూసీ అనుబంధం), భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఫ్ (ఆర్ఎస్ఎస్కు చెందిన కార్మిక సంఘం 'బీఎంఎస్' అనుబంధం) సమ్మెలో పాల్గొన్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారుల ఉద్యోగ సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించాయి.
కేంద్రం తన నిర్ణయాల్ని వెనెక్కి తీసుకోవాలి..
సమ్మెలో పాల్గొంటున్న కార్మిక సంఘాలు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్కు లేఖ రాశాయి. ఈ లేఖలో వారు ఏమన్నారంటే...''ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రయివేటీకరణ చేయటం ద్వారా 82వేల మంది సిబ్బంది జీవితాలు, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. 44వేల మంది సిబ్బంది 2004లో రిక్రూట్ అయ్యారు. ఎన్నో ఆశలతో చేరినవారంతా, ప్రస్తుత పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. 'ఎన్పీఎస్' పెన్షన్ పథకం వల్ల ఇప్పటికే వారు అన్యాయానికి గురయ్యారు. సంస్థలో నెలకొన్న అనిశ్చిత వాతావరణం నిపుణులైన ఉద్యోగుల్ని, కార్మికుల్ని బాధిస్తోంది. ప్రయివేటీకరణ, విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వటంపై పునరాలోచన చేసి, ఆ నిర్ణయాల్ని వెనెక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా''మని తెలియజేశారు.
ఓడీఎఫ్లను ప్రయివేటీకరించొద్దు : సీఐటీయూ
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రయివేటీకరించొద్దని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎద్దుమైలారం శివారు ఫ్యాక్టరీ మెయిన్గేట్ వద్ద మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఉద్యోగులు సామూహికంగా విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనగా.. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున మద్దతు తెలిపి మాట్లాడారు. ఆయుధ కర్మాగారం దేశంలోని రక్షణ రంగంలో కీలకమైందన్నారు. దేశానికి రక్షణగా ఉన్న ఓడీఎఫ్ను ప్రయివేటీకరణ చేయడంతో భద్రత లేకుండా పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వందకోట్ల ప్రజల బాగును విస్మరించిందన్నారు. సామాజిక న్యాయం, స్వావలంబనను విస్మరిం చిన కేంద్ర ప్రభుత్వంపై గొంతెత్తి నిలదీయా లన్నారు. కార్పొరేటీకరణ కుట్రలను సమ్మె పోరాటంతో పాతరేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేవరకు ఉద్యోగులందరూ విధులకు వెళ్లకుండా సమ్మె కొనసాగించాల న్నారు. అనంతరం వంటావార్పు చేశారు. సమ్మెలో సీఐటీయూ నాయకులు పాండురంగ రెడ్డి, జేఏసీ నాయకులు నర్సింహ రెడ్డి,రాజయ్య, కిరణ్ కుమార్, ఈశ్వర్ ప్రసాద్, బాహీరోద్దీన్, రవి పాల్గొన్నారు.