Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక మంత్రిత్వ శాఖ తక్షణమే ఏర్పాటు చేయాలి :రౌండ్ టేబుల్లో నేతల డిమాండ్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా అత్యధిక శాతం జనాభా కల్గిన ఓబీసీల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వక్తలు డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు గడిచినా... ఇప్పటికీ ఆయా వర్గాల ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కోవటం ఆందోళనకరమన్నారు. భారత రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. ఓబీసీల హక్కులపై వెనబడినవర్గాలు సాధికారిత సంఘం, అఖిల భారత వెనకబడిన వర్గాల అభ్యున్నతి సంస్థలు సంయుక్తంగా ఢిల్లీలోని కానిస్టిస్యూషన్ క్లబ్లో ''సామాజిక న్యాయం - సమానత్వం'' అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ శరద్ యాదవ్ మాట్లాడారు. రాజ్యాంగానికి కట్టుబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీల హక్కులను చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబీసీల హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ తూళ్ళ దేవేందర్గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓబీసీలను ఏకం చేసేందుకే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలు, మెజార్టీ ప్రజలకు జరుగుతోన్న అన్యాయాన్ని, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ దష్టికి తీసుకెళ్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందిన నాడే, దేశం అభివద్ది చెందుతుందన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు గ్రహించాలని కోరారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. వివక్షకు గురైన వెనకబడిన తరగతుల్లో సమానత్వం తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం పలు మండల కమిషన్లు వెలిసిందని తెలిపారు. ఈ కమిషన్లు సైతం విద్యా, ఉద్యోగ అవకాశాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించినా, నేటికి అవి అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 56 శాతం ఉన్న ఓబీసీలకు, రాజ్యాంగం కల్పించిన వాటా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మెన్ జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఏ వర్గీకరణలోకి రాని సంచార జాతులను గుర్తించి విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో వారికి సముచితం స్థానం ఇవ్వాలన్నారు. 14 శాతం వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు కాకముందే, 10 శాతం ఈబీసీలకు కేంద్రం రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ తిరుమలి, జస్టిస్ ఎం ఎన్ రావు, జస్టిస్ రామలింగేశ్వర్రావు, బీసీ సంఘం నేత వేలాద్రి వివిధ రాష్ట్రాలకు చెందిన ఓబీసీ నేతలు హాజరయ్యారు.