Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎద్దును చంపారనే ఆరోపణతో గిరిజనుడిని చావబాదిన పోలీసులు
- రెండేండ్ల క్రితం ఘటన
- మా బతుకులు ఆగం : బాధిత కుటుంబం
గాంధీనగర్ : రెండేండ్ల క్రితం ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో చోటుచేసుకున్న ఓ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఓ గిరిజనుడి కుటుంబం న్యాయం కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నది. గత ఐదేండ్లుగా దేశంలో చోటుచేసుకుంటున్న గో హత్యలకు భిన్నంగా ఎద్దును చంపారనే ఆరోపణతో ఓ గిరిజనుడు, దళితుడు, ఇద్దరు ముస్లింలపై 2017 మే 2న మూకదాడి జరిగింది. అయితే మూకదాడికి పాల్పడింది గోరక్షకులు కాదు. ప్రజలకు కాపలా ఉంటామని ప్రమాణం చేసే పోలీసులే కావడం గమనార్హం. ఈ దాడిలో పోలీసు దెబ్బలకు తాలలేక గిరిజనుడు ప్రాణాలు కోల్పోవడంతో అతడి కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి మారింది. ఈ కేసులో విచారణ ఇసుమంతైనా ముందుకుసాగడం లేదని మృతురాలి భార్య ఆరోపిస్తున్నారు.వివరాల్లోకెళ్తే... సబర్కాంత జిల్లా కొత్డగడి గ్రామంలో 2017 మే 2న ఓ ఎద్దు చనిపోయిందనీ, పలువురు దాని చర్మాన్ని ఒలిచారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి విచారణ ప్రారంభించారు. ఆ గ్రామంలో ఉన్న గిరిజనుడు కొదర్బి గమర్తో పాటు ఇద్దరు ముస్లింలను, సమీపంలో ఉన్న మరో ఊరికి చెందిన ఓ దళితుడిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. ముందుగా దళితుడిని చితకబాదారు. చనిపోయిన ఎద్దు చర్మాన్ని ఒలవడం తనకు తరాల నుంచి వస్తున్న సంప్రదాయమనీ, ఆ ఎద్దును తాను చంపలేదని బాధితుడు మొర పెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. అతడిపై విచక్షణారహితంగా దాడి చేసి ఈ కేసు నుంచి తప్పించాలంటే రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత ముస్లింలపైనా అదే తీరుగా ప్రవర్తించారు.తదనంతరం తన పొలంలో పనిచేసుకుంటున్న గమర్ వద్దకు వెళ్లి అతడిని కొట్టుకుంటూ గ్రామంలోకి తీసుకెళ్లారు. అక్కడ పోలీసు పటాలం అంతా బాధితుడిపై దాడికి దిగారు. నిబంధనలు మరిచి అతడిపై బెల్ట్లు, లాఠీలు, మారణాయుధాలతో నడివీదిలో అందరూ చూస్తుండగానే దాడి చేశారు. ఎద్దును తాను చంపలేదని ప్రాధేయపడుతున్నా వినకుండా గమర్ను రక్తమోడేట్టు కొట్టారు. వారి ఊరు నుంచి పక్క ఊరికి, ఆపై ఇరవై కిలో మీటర్ల దూరంలో ఉన్న మరోఊరికి తీసుకెళ్లి మరీ గిరిజనున్ని చావబాదారు. అనంతరం పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి.. రూ. 4 లక్షలిస్తే వదిలిపెడతామనీ, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. ఇది జరిగిన కొద్దిరోజులకు గాయాలకు తాలలేక గమర్ మరణించాడు.
ఘటనపై గమర్ భార్య శాంతాబెన్ మాట్లాడుతూ.. పోలీసులు తన భర్తను అన్యాయంగా కొట్టి చంపారని ఆరోపించారు. తమకు రెండు ఆవులు ఉండేవనీ, వాటికి గాయమైతేనే తన భర్త తట్టుకునేవాడు కాదనీ, అలాంటిది మరో జంతువును ఎందుకు చంపుతాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పదకొండు మంది సంతానమనీ.. గమర్ చనిపోయిన తర్వాత తామందరూ దిక్కులేని వారయ్యారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. పిల్లల్ని ఎలా పెంచాలో తనకు అర్థం కావడం లేదనీ, తమ బతుకులు జంతువులకంటే హీనంగా అయ్యాయని ఆమె వాపోయారు. రాజకీయ నాయకుల అండతో తన భర్త కేసును కొట్టివేసేందుకు పోలీసులు కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో విచారణ జరిపి నిందితులను శిక్షించడంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.