Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోట్లరద్దుతో ఆర్థిక కష్టాలకు బీజాలు
- కేంద్రం నిర్ణయాలతో క్షీణించిన కొనుగోలు శక్తి
న్యూఢిల్లీ: మందగమనం ప్రమాద ఘంటికలను పలు రిపోర్టులు మరింత స్పష్టం చేస్తున్నా.. మోడీ సర్కారు మాత్రం మాంద్యాన్ని గుర్తించేందుకు వెనుకాడుతున్నది. ఇటీవలే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాంద్యంపై ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు తిరస్కరించారు. పలురంగాల్లో వృద్ధి మందగించడం, అమ్మకాలు క్షీణించిన విషయాన్ని ధ్రువీకరిస్తూ.. కొన్ని రక్షణాత్మక చర్యలను ప్రకటించారు. దీంతో సమస్యనే సరిగ్గా గుర్తించనిది సంపూర్ణ పరిష్కారమెలా సాధ్యమన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థనే సక్రమంగా నిర్వహించని సర్కారు ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను ఎలా నడుపుతుందన్న విసుర్లు వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుత మందగమనానికి మోడీ సర్కారు చర్యలే ప్రధాన కారణమని ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చను తీవ్రం చేశాయి. ఆయన వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి కొట్టిపారేసినప్పటికీ వాటిపై చర్చ నడుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం జీడీపీ ఐదు శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెలకొన్న మందగమనానికి కొన్ని కారణాలు..
నోట్ల రద్దు
2016 నవంబర్లో మోడీ సర్కారు హఠాత్తుగా ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఈ నిర్ణయం రైతులపై తీవ్ర ప్రభావాన్ని వేసింది. అప్పటికే దుస్థితిలో జీవనం సాగిస్తున్న రైతులు ఈ దెబ్బతో కుదేలయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ చేసుకునే కంపెనీలు ఆ ఏడాది నుంచే నోట్లరద్దు నిర్ణయం పర్యవసానాన్ని చవిచూశాయని జేఎన్యూ ప్రొఫెసర్ హిమాంశు వివరించారు. నాలుగేండ్ల క్రితం జీడీపీలో 6.2శాతంగా వృద్ధి నమోదు చేసిన వ్యవసాయరంగం నేడు 2.4శాతానికి పడిపోయిందని నిపుణులు తెలిపారు. మద్దతు ధర పెంచుతున్నప్పటికీ అది పూర్తిస్థాయి పరిష్కారాన్ని చూపలేకపోయిందని వివరించారు.
రియల్ ఎస్టేట్ తిప్పలు
నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాల్లో మందగమనం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దాదాపు 40శాతం ఉపాధిని కల్పించే ఈ రంగాలు గత నాలుగేండ్లుగా సంక్షోభ పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి. గడిచిన ఒక సంవత్సరంలోనే ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు 30శాతం సన్నగిల్లాయి. వేతనాల్లోనూ భారీగా కోతకు గురయ్యాయయని టాటా రియల్టీ సీఈవో సంజరు దత్ తెలిపారు. అదీగాక, గ్రామీణ ప్రాంతాల నుంచి(వ్యవసాయ రంగం నుంచి) ఈ రంగాల్లో ఉపాధి కోసం పట్టణాలకు వలస వచ్చినవారి సంఖ్యా పెరిగినట్టు సీఎంఐఈ రిపోర్టు వివరిస్తున్నది.
పెట్టుబడుల్లేక విలవిల
పెట్టుబడులతోనే వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. దాంతో ఉద్యోగాల సృష్టి, మంచి వేతనాలు, ఈ పరిస్థితులే వినిమయానికి దారులు వేస్తాయి. దీంతో మార్కెట్లో కొనుగోళ్లు పెరుగుతాయి. కానీ, ఇటీవలి కాలంలో పెట్టుబడులు భారీగా పడిపోతున్నాయి. 2018-19లో భారత మార్కెట్ల నుంచి దాదాపు 15వేల కోట్ల ఫారీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లు వెనక్కి మళ్లాయి. అదీగాక, విదేశీ పెట్టుబడులు ప్రస్తుతమున్న సంస్థల్లోని వాటాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నాయనీ, కొత్తగా వ్యాపార సంస్థలు నెలకొల్పడం లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. కొత్త సంస్థలు నెలకొల్పకపోతే.. ఉద్యోగాల సృష్టి జరగదన్న చర్చ నడుస్తున్నది.
నిరుద్యోగం
దేశంలో నిరుద్యోగం ఆందోళనకరంగా పెరిగిపోయింది. అదీగాక, మందగమనంతో టయోటా, మహీంద్రా, హ్యుండారులాంటి ఆటోమేకర్ కంపెనీలు దాదాపు 3.5లక్షల ఉద్యోగులను తొలగించారు. పదివేల రైల్వే ఉద్యోగాల కోసం 25లక్షల దరఖాస్తులు రావడమే దేశంలోని నిరుద్యోగానికి నిదర్శనం. నిరుద్యోగంతో కొనుగోలు శక్తి క్షీణించి మార్కెట్లో అమ్మకాలు పడిపోతున్నాయి.
వినియోగదారుల డిమాండ్ క్షీణత
భారత ఆర్థిక వ్యవస్థ గ్రామీణ కేంద్రకమైనదని ప్రస్తుత పరిస్థితులు వివరిస్తున్నాయి. వ్యవసాయ రంగ వృద్ధి క్షీణించడంతో ట్రాక్టర్ల తయారీ, ఎరువుల ఉత్పత్తి సహా ఇతర రంగాల్లోనూ విక్రయాలు పడిపోయాయి. అంతేకాదు, నిత్యావసర సరుకులు ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లోనూ అప్పటి నుంచి ఇప్పటి వరకు వృద్ధి పెద్దగా కనిపించింది లేదు. నోట్లరద్దు, జీఎస్టీలతో ప్రభుత్వం.. ప్రజల చేతుల్లో నుంచి నగదును లాగేసుకున్నంత పనిచేసింది. ఎందుకంటే ఈ నిర్ణయాల తర్వాత కుటుంబ ఆదాయాల్లోనూ క్షీణత కనిపించిందని ఆర్థిక నిపుణులు టీసీఏ అనంత్ తెలిపారు. దీంతో సరుకులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం, లేదా రద్దు చేసుకున్నారని తెలుస్తున్నది.