Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంలోకి వెళ్లి అనంతరం గ్రౌండ్ స్టేషన్తో సంబంధాలు కోల్పోయిన ల్యాండర్ విక్రమ్తో తిరిగి కమ్యూనికేషన్ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మంగళవారం వెల్లడించింది. విక్రమ్ ల్యాండర్ ఉనికిని గుర్తించినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రౌండ్ స్టేషన్తో విక్రమ్ సంబంధాలు కోల్పోయి ఇప్పటికి నాలుగు రోజులు గడిచాయి. సాఫ్ట్ ల్యాండింగ్కు బదులు హార్ట్ ల్యాండింగ్ జరిగిన నేపథ్యంలో విక్రమ్ వాస్తవ పరిస్థితిపై ఇటు శాస్త్రవేత్తలతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ భద్రంగానే ఉందని ఇస్రో సోమవారం తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై పడిపోయిన విక్రమ్ చెక్కుచెదరకుండా ఉందా? దాన్ని పునరుద్ధరించవచ్చా? లేదా ప్రక్కకు పడిపోయిందా.? దాని యాంటీనాలు చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్కు అనుకూలంగా ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు కృషి చేస్తున్నామని ఇస్రో వర్గాలు తెలిపాయి. సంబంధాల పునరుద్ధరణ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టతరమైన విషయమైనా, అందుకోసం శాయశక్తులా కృషి చేస్తున్నామని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.