Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో ఘటన.. దర్యాప్తునకు జిల్లా మేజిస్ట్రేటు ఆదేశం
లక్నో : బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో చిన్నారుల సంక్షేమం, విద్య పట్ల రాష్ట్ర సర్కారుకు ఏ మాత్రం శ్రద్ధ లేకుండా పోయింది. అలాగే శాంతి భద్రతల పేరుతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ తమకు అడ్డొచ్చే జర్నలిస్టుల పైనా ఉక్కుపాదం మోపుతున్నది. రాష్ట్రంలోని పాఠశాలల్లో చోటుచేసుకుంటున్న యాజమాన్యాల లోపాలను బయటకు తెస్తున్న జర్నలిస్టుల పైనే యోగి సర్కారు ఉల్టా కేసులు బనాయిస్తున్నది. మొన్న మీర్జాపూర్లోని పాఠశాలలో చిన్నారులకు చపాతి, ఉప్పుతో 'మధ్యాహ్న భోజన' ఘటనను బయటకు తీసుకొచ్చిన పవన్ జైస్వాల్ అనే జర్నలిస్టుపై యూపీ పోలీసులు అన్యాయంగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అది మరవకముందే ఆజంఘర్ జిల్లాలో మళ్లీ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఊడ్పూర్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులే తమ తరగతి గది నేలను శుభ్రం చేస్తూ కనిపించారు. దీనిని గమనించిన సంతోశ్ జైశ్వాల్ అనే జర్నలిస్టు తన కెమెరాతో ఫోటోలు, వీడియోనూ తీశాడు. ఈ ఘటనపై ఆధారాలతో సహా స్థానిక పోలీసులకు సంతోశ్ ఫిర్యాదు చేశారు. అయితే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్ రాధేశ్యాం యాదవ్తో పాటు సంతోశ్ను సైతం అరెస్టు చేశారు.
పిల్లలతో సంతోశ్ బలవంతంగా ఈ పని చేయించి తమ వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు యాదవ్ ఫిర్యాదు చేశారు. యాదవ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంతోశ్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల తీరుపై స్థానిక జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించిన జిల్లా మేజిస్ట్రేటు ఎన్పి సింగ్ను వారు కలిశారు. ఈకేసులో జర్నలిస్టుకు ఎలాంటి అన్యాయం జరగదనీ, దీనిపై దృష్టి సారిస్తానని వారికి సింగ్ హామీ ఇచ్చారు.