Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస ప్రమాణాలు పాటించరా అని మండిపాటు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రంలో ఔషధ పరిశ్రమల కాలుష్య నివారణపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలేపల్లి సెజ్ పరిధిలోని జౌషధ పరిశ్రమల కాలుష్యంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన నివేదికపై శుక్రవారం ఎన్జీటీ విచారణ జరిపింది. సెజ్ పరిశ్రమల కాలుష్య నియంత్రణలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని జస్టిస్ ఏకే గోయల్తో కూడిన ధర్మాసనం పీసీబీ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ సందర్భంగా పీసీబీ ఇచ్చిన నివేదికలపై ఎన్జీటీ అసంతప్తి వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణపై సమర్పించే నివేదికలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన నమూనాలు మీకు తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సెజ్ ఏరియాలో కాలుష్య నియంత్రణపై కఠిన చట్టాలను అమలుపరుస్తున్నట్టు పీసీబీ తరపు న్యాయవాది ధర్మాసనానికి సూచించారు. ఇప్పటికే మూడు పరిశ్రమల మూసివేతకు ఆదేశించామని, మరిన్ని పరిశ్రమలకు కాలుష్య నియంత్రణపై సూచనలు చేసినట్టు ధర్మాసనానికి వివరించారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ ధర్మాసనం ప్రతి సంవత్సరం పరిశ్రమలను ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నించింది. రాష్ట్ర పీసీబీ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించని ధర్మాసనం, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, వాటి నియంత్రకు తీసుకుంటున్న చర్యలపై పీిసీబీ, సీపీసీబీ సంయుక్త నివేదికను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణనను వచ్చే ఏడాది జనవరి 24 కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.