Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'జై శ్రీరాం' అంటూ నినాదాలు
- యూనివర్సిటీ గేటు దగ్గరే ఘటన
- సహాయం కోరినా పట్టించుకోని పోలీసులు
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని జాదవ్పూర్ యూనివర్సిటీ(జేయూ) గేటు వద్ద ఓ విద్యార్థిపై కాషాయమూక విరుచుకుపడింది. క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా దాడి చేసింది. మూక నుంచి రక్షించాలని పక్కనే ఉన్న పోలీసులను అర్థించినా.. వారు పట్టించుకోలేదు. చివరకు మరికొందరు విద్యార్థులు ఆ మూక నుంచి బాధితుడిని రక్షించారు. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో జాదవ్పూర్ యూనివర్సిటీకి గురువారం వెళ్లడం.. అదేరోజు వామపక్ష విద్యార్థులపై ఏబీవీపీ సభ్యులు దాడులు చేసి, కార్యాలయాలకు నిప్పుపెట్టి హింసాకాండ సృష్టించారు. ఏబీవీపీకి వ్యతిరేకంగా గురువారం జరిగిన ఓ ప్రదర్శనలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న పవన్ శుక్లా పాల్గొన్నాడు. అనంతరం సాయంత్రంపూట వర్సిటీ నుంచి బయటికెళ్లిన పవన్ శుక్లా తిరిగి వస్తుండగా.. గేటు నెంబర్ 4 దగ్గర కొందరు క్రికెట్ బ్యాట్లు, వికెట్లు, కర్రలు పట్టుకుని నిలుచున్నారు. వర్సిటీలోకి వెళ్తుండగా.. బ్యాట్లు, వికెట్లు పట్టుకుని ఇక్కడ ఎందుకు నిల్చున్నారని, ఎవరిని కొట్టేందుకు వచ్చారని ఆ మూకను విద్యార్థి పవన్ ప్రశ్నించారు. అంతే, ఆ మూక పవన్పైనే జై శ్రీరాం అంటూ తనపైనే విరుచుకుపడిందని పవన్ వివరించారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే దాదాపు 50 నుంచి 60 మంది బ్యాట్లు, వికెట్లు, కర్రలతో చుట్టుముట్టి కొట్టారని చెప్పారు. పక్కనే ఉన్న పోలీసులను సహాయం కోసం కోరగా.. వారు పట్టించుకోలేదని అన్నారు. కొందరు విద్యార్థులు బహుశా ఏబీవీపీ వైఖరిని నిరసించేవారు కాబోలు.. వచ్చి తనను కాపాడి ఆస్పత్రికి చేర్చారని వివరించారు. కేపీసీ ఆస్పత్రిలో చికిత్స పొందారని, గాయాలకు కుట్లు వేశాక తిరిగి క్యాంపస్కు వెళ్లారని చెప్పారు. సన్నిహితులతో కాసేపు గడిపి తిరిగి ఇంటికెళ్లారని వివరించారు. తాను ఏ రాజకీయ విద్యార్థి సంఘ సభ్యుడిని కాదనీ, కేవలం ఏబీవీపీ వైఖరితో విబేధించే ఆ ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు. ఆ ప్రదర్శనలో తనను చూసినవారు ఆ మూకలో ఉండొచ్చని అనుమానించారు. దాడి చేసినవారు.. రూ 200 నుంచి 300 వరకు డబ్బులిచ్చి లేదా ఒక బాటిల్ లిక్కర్ ఇచ్చి పెట్టుకునే కిరాయి మనుషుల్లాగే ఉన్నారన్నారు. పవన్ ముఖంపై గాయాలు, అతని తెల్లని చొక్కాపై రక్తపు మరకలతో కూడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, జాదవ్పూర్ యూనివర్సిటీలో ఏబీవీపీ హింసాకాండకు నిరసనగా.. జేయూ విద్యార్థులకు మద్దతుగా సమీపంలోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, ఢిల్లీలోని జేఎన్యూ విద్యార్థులు సంఘీభావ ప్రదర్శన చేయబోతున్నట్టు ప్రకటించారు.