Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి చరిత్రకారులు, కళాకారులు, విద్యావేత్తల లేఖ
న్యూఢిల్లీ, శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్లో సమాచార వ్యవస్థను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దేశంలోని పలువురు చరిత్రకారులు, మేధావులు, విద్యావేత్తలు కేంద్రానికి లేఖ రాశారు. గతనెల 5న కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత అక్కడ సమాచార వ్యవస్థను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి పౌరులందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, వారి క్షేమ సమాచారాలు తెలియక ఇతర ప్రాంతాల్లో ఉండే వారి బంధువులు మానసిక వేదనను అనుభవిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమాచారం అందడం లేదనీ, దీంతో వారంతా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని రాశారు. రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, జావేద్ మాలిక్, జోయా హసన్, ప్రభాత్ పట్నాయక్ వంటి విద్యావేత్తలు సుమారు 80 మందికి పైగా లేఖపై సంతకం చేశారు.
కాశ్మీర్కు చేరుకున్న తరిగామి మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ సైతం..
అనారోగ్యంతో ఢిల్లీలోని ఏయిమ్స్లో చికిత్స పొందిన సీపీఐ(ఎం) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ తరిగామి శుక్రవారం స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయనను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న తరిగామి.. సుప్రీంకోర్టు అనుమతితో ఈ నెల 9న ఏయిమ్స్లో చేరారు. అక్కడ చికిత్స అనంతరం ఆయన తిరుగు పయనమయ్యారు.
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ సైతం శుక్రవారం కాశ్మీర్ చేరుకున్నారు. స్వరాష్ట్రానికి వెళ్లడానికి తనను అనుమతించాల్సిం దిగా ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై కోర్టు ఆమోదం తెలపడంతో ఆజాద్ శ్రీనగర్ వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన బారాముల్లా, అనంత్నాగ్, జమ్మూ, శ్రీనగర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయొద్దనీ, సభలు నిర్వహించకూడదని కోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది.
మీరు ఆరోపించినట్టు లేదు : సుప్రీంకోర్టు
'జమ్మూకాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తి నుంచి మాకు నివేదిక వచ్చింది. అందులో మీరు ఆరోపించినట్టుగా ఏం లేదు' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాశ్మీర్ ప్రజలు న్యాయం కోసం అర్థిస్తున్నారనీ, న్యాయస్థానాలను ఆశ్రయించడానికీ వారికి అవకాశం లేకుండా పోతున్నదని దాఖలైన పిటిషన్పై విచారిస్తున్న ధర్మాసనం పై విధంగా స్పందించింది. ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ రెండు వారాల తర్వాత జరగనుంది. అలాగే కాశ్మీర్కు చెందిన ఐదుగురు వ్యక్తులను నిర్బంధించారన్న పిటిషన్పై రెండు వారాల్లో స్పందించాలని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.