Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో 'పీఎంకిసాన్' మూడో విడత నగదు విడుదలలో జాప్యం
లక్నో : రైతులకు పెట్టుబడి వ్యయం అందజేసేందుకు గానూ మోడీ సర్కారు తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) లోని మూడో విడత నగదు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఒక్కరైతుకూ అందలేదు. ఈ మేరకు ఈ స్కీంకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ విషయం (సోమవారం నాటికి) వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం.. మూడు విడతల చొప్పున మొత్తం రూ. 6 వేలను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉంది. మూడో విడతలో భాగంగా ఆగస్టు-నవంబర్ మధ్య విడుదల చేయాల్సిన రూ.2 వేలను యూపీలో ఒక్కరైతుకూ జమచేయకపోవడం గమనార్హం. రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ నగదు విడుదల చేయకపోవడం పట్ట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కీం కింద దేశవ్యాప్తంగా లబ్దిదారుల్లో ప్రతి నలుగురిలో ఒక రైతు యూపీకి చెందినవారే. యూపీలో సుమారు 1.58 కోట్ల మంది లబ్దిదారులు ఈ పథకం కింద లబ్ది పొందుతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్న నేపథ్యంలో రైతులకు నగదు ఇంకా విడుదల చేయకపోవడం పట్ల ఇందుకు సంబంధించి నివేదికను అందజేయాలని సంబంధిత శాఖ అధికారులకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించినట్టు సమాచారం. ఇదే విషయమై యూపీకి చెందిన వ్యవసాయాధికారులను ప్రశ్నించగా.. రైతుల గుర్తింపు పత్రాల సేకరణలో జాప్యం కారణంగా నిధులు విడుదల కాలేదని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. ఇదిలాఉండగా రెండో విడతలో కూడా దాదాపు 38 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ అందలేదనే ఆరోపణలున్నాయి.