Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి
- చట్ట ఉల్లంఘనులను రక్షిస్తున్న మోడీ సర్కారు : సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో విమర్శ
న్యూఢిల్లీ : రాయితీపై ఇచ్చే ఆహార ధాన్యాలను పెంచాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో డిమాండ్ చేసింది. ప్రజల ఆదాయం పడిపోతున్నదనీ, తద్వారా పోషకాహార లోపం తీవ్ర రూపం దాలుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సమావేశం చర్చించిన అంశాలపై గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. 2018 సంవత్సరానికి సంబంధించి 119 దేశాల ప్రపంచ ఆహార సూచీలో భారత్ 103వ స్థానంలో నిలిచిందంటే దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారన్న విషయం స్పష్టమవుతున్నది. మరోవైపు ప్రభుత్వ గోడౌన్లలో పెద్దమొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు మూలుగుతున్నాయి. ఆగస్టు 19, 2019 నాటికి రికార్డు స్థాయిలో 713 లక్షల టన్నుల నిల్వలున్నాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఆర్థిక మాంద్యం పెచ్చరిల్లిపోతున్న ప్రస్తుత సమయంలో రాయితీ ఆహార ధాన్యాలను పెద్ద మొత్తంలో పంపిణీ చేయాలని, ఒక్కొక్క కుటుంబానికి 35 కేజీల చొప్పున ప్రభుత్వం అందించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.
ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారం
ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక వ్యవస్థ మందగమనం, పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడం, వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న క్షీణత వలన ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతున్నది.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రక్షిస్తున్న ప్రభుత్వం
ఇటీవల దేశవ్యాప్తంగా చట్టవిరుద్ధమైన మూకదాడులు విపరీతంగా పెరిగిపోతు న్నాయి. అనేకమంది అమాయక ప్రజలను గోరక్షణ పేరుతో పొట్టనపెట్టుకుంటున్నారు. అయితే నేరస్తులను శిక్షించాల్సిన ప్రభుత్వం, ఇతర సంస్థలు వారిని ఈ కేసుల నుంచి తప్పిస్తున్నాయి. చివరకు మహిళలపై సామూహిక లైంగిక దాడులకు పాల్పడిన వారిని కూడా రక్షిస్తున్నారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మహిళలు, దళితులు, మైనార్టీ వర్గాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. మహిళలపై జరుగు తున్న దాడులకు సంబంధించి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి విడుదల చేయడం లేదు. నేరస్తులను పెంచి పోషించే చర్యలను మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా విడనాడాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి
ప్రస్తుతం దాదాపు 23 లక్షల మంది ఆదివాసీల జీవితాలపై కత్తివేలాడుతున్నది. అటవీ భూముల నుంచి ఆదివాసీలను పంపించి వేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తన ఆదేశాలపై ఇటీవల స్టే విధించిన కోర్టు ఇటీవల తిరిగి విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యం లో ఆదివాసీలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను విరమించుకొని, పూర్తిస్థాయిలో అమలు చేయాలని పొలిట్బ్యూరో డిమాండ్ చేసింది.
కోల్కతా ప్లీనం నిర్ణయాల అమలుపై సమీక్ష
కోల్కతా ప్లీనంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై ఆయా రాష్ట్ర కమిటీలు పంపిననివేదికలపై పొలిట్బ్యూరోచర్చించింది. ఈ చర్చల ఆధారంగా ఒక నివేది కను రూపొందించి దాన్ని అక్టోబర్ 2 నుంచి 4 వరకూ న్యూఢిల్లీలో జరగ నున్న పార్టీ కేంద్రకమిటీ సమావేశం ముందుంచుతామని పొలిట్బ్యూరో తెలిపింది.
రాజ్యాంగ హామీలపై దాడి
కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ రాజ్యాంగపరమైన హామీలపై దాడిని వేగవంతం చేసిందని పొలిట్బ్యూరో విమర్శించింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు రాష్ట్రంలో తీవ్రమైన ఆంక్షలను కొనసాగించడం ద్వారా ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతోపాటు దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కేవిధంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా పలురకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఇటీవల చేసిన 'ఒక దేశం- ఒకే భాష' అనే ప్రతిపాదనపై పలు రాష్ట్రాలు, పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. అమిత్షా ఇప్పుడు ఏకంగా దేశంలో ఉన్న బహుళ రాజకీయ పార్టీల అవసరాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, ఫెడరిలిజం, మానవ హక్కులు, పౌర స్వేచ్ఛపై మోడీ సర్కార్ యథేచ్ఛగా దాడి చేస్తున్నది.
విభజన సృష్టే బీజేపీ లక్ష్యం: దేశంలో మతాల మధ్య విభజనను సృష్టించి, ఓటు బ్యాంకును పెంచుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నార్సీని ప్రవేశపెట్టడంతో పాటు ఇతర చర్యలకు పూనుకుంటున్నదని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో విమర్శించింది. అసోం మాదిరిగానే తమ రాష్ట్రాల్లో కూడా జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్నార్సీ)ని ప్రవేశపెట్టాలని బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎన్నార్సీ అనేది అసోం ఒప్పందంలో ఒక భాగం. ఇది ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైనది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అంతా నడిచింది. దీనికి సంబంధించి ఇటీవల ప్రకటించిన ఎన్నార్సీ జాబితాలో దాదాపు 29 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. తమపై ఎటువంటి వివక్ష లేకుండా న్యాయబద్ధంగా తమ విజ్ఞప్తులను పరిశీలించి న్యాయం చేయాలని జాబితాలో పేర్లులేని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు జాతీయ జనాభా నమోదు (ఎన్పిఆర్)ను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ 2020 వరకూ ఈ ప్రక్రియను చేపట్టాలని గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 2003లో పౌరసత్వ చట్టాన్ని సవరించడం ద్వారా అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ఈ ఎన్పిఆర్ను తీసుకువచ్చింది. ఆధార్ అమల్లోకి వచ్చాక డూప్లికేషన్ అవుతుందని భావించి ఎన్పిఆర్ను నిలిపివేశారు. అయితే మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్పీఆర్ను పునరుద్ధరించింది. తద్వారా దాన్ని ఆధారంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఎన్నార్సీని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా ఓటర్లు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఎలక్ట్రోరల్ వెరిఫికేషన్ ప్రాసెస్(ఈవీపీ) అనే ప్రక్రియను ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. అయితే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న దేశంలో ఈ ప్రక్రియ అసాధ్యమని, ఇది ప్రజలను జాబితా నుంచి మినహాయించే చర్యగా మారుతుందని పొలిట్బ్యూరో తెలిపింది. ఎన్నికల సంఘం ఇప్పటికే జారీ చేసిన ఓటర్ కార్డుల్లో ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ప్రత్యేక లక్ష్యం కోసం ఈ ఇవిపి ప్రక్రియను ముందుకు తెచ్చినట్టు కనిపిస్తోంది. దీనికితోడు పౌరసత్వ సవరణ బిల్లు(సీఏబీ)ని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన ఎన్ఆర్సి జాబితాలో పేర్లులేని ముస్లిమేతరులకు తిరిగి చోటుకలిస్తామని, అసలైన పౌరతస్వం ఉన్నా, తరాలుగా నివసిస్తున్నా కూడా ముస్లిములకు చోటుకల్పించేది లేదని ఆయన చెప్పినట్లవుతుంది.
కేంద్ర ప్రభుత్వం పలువర్గాల ప్రజలనే లక్ష్యంగా చేసుకొని దేశంలో విభజన తీసుకువచ్చేందుకు ఈ ఎన్నార్సీ, ఎన్పీఆర్, ఈవీపీ, సీఏబీ అనే నాలుగు పద్ధతులను తీసుకువస్తోందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో విమర్శిం చింది. మతం ఆధారంగా పౌరసత్వాన్ని ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఇటువంటి చర్యలు కులం, మతం, లింగంతో నిమిత్తం లేకుండా పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేసింది. ఆర్థిక మాంద్యం నెలకొన్న స్థితిలో ఇలాంటి వేలాది కోట్ల అనవసర ఖర్చును దేశ ఖజానా తట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలను నిలిపివేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.