Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ తాపత్రయం
- కార్పొరేట్లకు వారంలోనే రూ.2 లక్షల కోట్ల రాయితీలు
- ఒకవైపు లక్షల్లో ఉద్యోగాలు కోల్పోతున్న యువత
- మరోవైపు పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు
- ప్రజా సమస్యలకు వామపక్షాలే సమాధానం చూపగలవు
- అక్టోబర్ 10 నుంచి 16 వరకు దేశవ్యాప్త ఆందోళనలు : ఐదు వామపక్ష పార్టీల జాతీయ కన్వెన్షన్లో ఏచూరి
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని మోడీ సర్కార్ అంబానీ, అదానీల కోసమే పని చేస్తున్నదని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. ఆర్బీఐ వద్ద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.1.76 లక్షల కోట్లను దేశీయ డిమాండ్ను, ఉపాధిని పెంచేందుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజల పక్షాన నిలబడాల్సిన కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకు చర్యలను వేగవంతం చేసిందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందనీ, ఈ సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు ప్రభు త్వ చర్యలు శూన్యమని పేర్కొన్నారు. దేశం ప్రజానీకం వద్ద కొనుగోలు శక్తి పడిపోయిందనీ, దాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టకుండా కంపెనీలకు కోట్లలో పన్ను మినహాయింపు ఇవ్వడంలో మోడీ సర్కార్ ఆంతర్యమేంటనీ ప్రశ్నించారు. ''కేంద్ర ప్రభుత్వం యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ప్రభుత్వ పెట్టుబడులు పెంచి ఉపాధిని సృష్టించాలి. కనీసం వేతనం నెలకు రూ.18 వేలు ఇచ్చేందుకు హామీ ఇవ్వాలి.
ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరణ చేయడాన్ని ఆపాలి. రక్షణ, కోల్ రంగాల్లో వంద శాతం ఎఫ్డీఐలను ఉపసంహరిం చుకోవాలి. బీఎస్ఎన్ఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, ఇండియన్ రైల్వే, ఎయిర్ ఇండియా వంటి పెద్ద ప్రభుత్వం సంస్థల ప్రయివేటీకరణ ఆపాలి. మనరేగాకు నిధులు కేటాయించాలి. కనీస వేతనంతో కూడిన రెండు వందల రోజులు పని కల్పించాలి. వ్యవసాయ సంక్షోభం, పెరిగిన రైతుల ఆత్మహత్యలను తగ్గించేందుకు రైతులకు ఒకేసారి మొత్తం రుణమాఫీ చేయాలి. పెట్టుబడికి 50 శాతం పెంచి కనీస మద్దతు ధర ప్రకటించి, దాన్ని అమలు చేయాలి. వృద్ధాప్య పెన్షన్ నెలకు రూ.3000లకు పెంచాలి'' అంటూ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అక్టోబర్ 10 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్లో ఐదు వామపక్ష పార్టీల నేతృత్వంలో ''తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా భారత దేశం నిరసన, పెరుగుతున్న ప్రజల కష్టాలు'' అంశంపై జాతీయ కన్వెన్షన్ జరిగింది. ఈ కన్వెన్షన్కు హన్నన్ మొల్లా(సీపీఐ(ఎం), డి.రాజా, పల్లవ్ సేన్ గుపా ్త(సీపీఐ), కవితా కృష్ణన్(సీపీఐ(ఎంఎల్), ధర్మేందర్(ఫార్వర్డ్ బ్లాక్), మను రంజన్ భట్టాచార్య(ఆరెస్పీ)లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు అనురాగ్ సక్సేనా మోడీ సర్కార్ ఆర్థిక తిరోగమనంపై వివరించారు.
ఆర్థిక పతనం తీవ్రతరం: సీతారాం ఏచూరి
దేశంలో ఆర్థిక పతనం తీవ్రతరమైందని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం విలతాండవం చేస్తున్నదనీ, అన్ని రంగాల్లో నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉపాధి క్షీణించిపోయిందని అన్నారు. ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్ వంటి అన్ని రంగాల్లో ఉపాధి పడిపోయిందనీ, ఉన్న ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవల్సింది పోయి, మోడీ సర్కారు మాత్రం కార్పొరేట్లకు పన్ను మినహాయింపు ఇస్తున్నారని విమర్శించారు. ప్రజలు కొనుగోలు శక్తి కోల్పోయి, నడ్డివిరిచినట్టు ఉంటే, మరోవైపు ప్రభుత్వం కూడా వారిపైనే దాడి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ కొన్ని రోజుల క్రితం కార్పొరేట్లకు రూ.70 వేల కోట్లు రాయితీలు ఇచ్చిందనీ, మళ్లీ ఇప్పుడు మరో రూ.1.45 లక్షల కోట్లు రాయితీలు ప్రకటించారనీ, ఈ వారంలోనే దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైబడి రాయితీలు ఇచ్చారని తెలిపారు. దేశంలోని వస్తువులకు డిమాండ్ కల్పించలేకపోతున్నారుగానీ, విదేశీ పెట్టుబడుల కోసం ఎగబాకుతున్నారని విమర్శించారు. మోడీ సర్కార్ కాశ్మీర్, అసోం రాష్ట్రాలపై దాడికి పూనుకుందని విమర్శించారు. కాశ్మీర్లో 4 వేల మందిని నిర్బంధించారనీ, ఇప్పటి క 45 రోజులు గడిచాయనీ, కానీ ల్యాండ్లైన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేవని తెలిపారు. అసోంలో ఎన్ఆర్సీ ప్రకటించి దాదాపు 20 లక్షల భారతీయులను విదేశీయులుగా మార్చారని వివరించారు. దేశంలో నెలకొన్న సమస్యలకు వామపక్షాలు మాత్రమే సమాధానం ఇవ్వగలవని స్పష్టం చేశారు.
జాతి సంపదను దోచిపెడుతున్నారు:డి.రాజా( సీపీఐ)
జాతీయవాదం గురించి మాట్లాడే మోడీ పరివారం, జాతి సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా ఆరోపించారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి, దాని స్థానంలో నిటి ఆయోగ్ను తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేయాలని నిటి ఆయోగ్ ప్రతిపాదిస్తే, దాన్ని మోడీ సర్కార్ అమలు చేస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకొని, అందులో వంద శాతం ఎఫ్డీిఐలను ఆహ్వానించారని ఆరోపించారు. బ్యాంకుల విలీనం కూడా అందులో భాగంగానే వచ్చిందని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బ్యాంకుల విలీనం చేశారన్నారు. సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ మోడీ వంద రోజుల పాలన ఆర్థిక తిరోగమనాన్ని అందించిందని విమర్శించారు. దేశంలో కార్పొరేట్లకు సాయం చేసేందుకే ప్రభుత్వం నడుస్తుందనీ, ప్రజల కోసం కనీసం ఆలోచించటం లేదని మండిపడ్డారు.
ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేబబ్రాత బిశ్వాస్ మాట్లాడుతూ దేశంలో ఒక పక్క లక్షల్లో ఉద్యోగాలు ఊడిపోతున్నాయనీ, మరోవైపు రైతులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వాపోయారు. కానీ ఈ వర్గాలకు మోడీ సర్కార్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఆరెస్పీ ప్రధాన కార్యదర్శి క్షితి గోస్వామి మాట్లాడుతూ దేశ ప్రజల కోసం వామపక్షాలు చేసే ఆందోళనలో అందరు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, నీలోత్పల్ బసు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ పుణ్యవతి, ఆర్ అరుణ్ కుమార్, విజూ క్రిష్ణన్, నత్తూ ప్రసాద్, ఏఆర్ సింధూ పాల్గొన్నారు.