Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు రూ.1.45 లక్షల కోట్ల తాయిలాలు
- రియల్ ఎస్టేట్ బడా వ్యాపారులకు మొన్న రూ.10వేల కోట్ల ప్యాకేజీ
- ఐదున్నరేండ్లలో పన్ను మినహాయింపులు రూ.5.76 లక్షల కోట్లు
- ఇంధనధరల పెంపుతో సామాన్యుడిపై భారం
వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం పెరుగుతున్నాయి. కొత్త కొత్త చట్టాలు చేసి(మోటార్ వెహికల్ యాక్ట్) వేలల్లో, లక్షల్లో పన్నులు విధిస్తున్నారు. మరోవైపు కార్పొరేట్లకు, అత్యంత ధనికులకు మోడీ సర్కార్ వరాలు ప్రకటిస్తోంది. తాజాగా లక్షా 45వేల కోట్ల రూపాయల పన్ను మినహాయింపులు ప్రకటించారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానా...భారీ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. దీనివల్ల ముందు ముందు ప్రజా సంక్షేమం మరింత దెబ్బతినే ప్రమాదముంది. ధరల పోటు, జరిమానాల వేటుకు బలవుతున్న సామాన్యుడ్ని పట్టించుకోకుండా, బడా బాబులకు పన్ను మినహాయింపులు ఇవ్వటాన్ని ఆర్థిక విశ్లేషకులు తప్పుబడుతున్నారు.
న్యూఢిల్లీ : మనదేశంలో 'కార్పొరేట్ లాబీ' ప్రభుత్వ ఆర్థిక విధానాల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. కార్పొరేట్ కంపెనీలకు, అత్యంత ధనికులకు(సూపర్ రిచ్) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీగా తాయిలాలు ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం, దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్ను(సర్ఛార్జ్, సెస్ కలిపి) 34.94శాతం నుంచి 22శాతానికి తగ్గించారు. కొద్ది రోజుల క్రితం రియల్ ఎస్టేట్లోని బడా పెట్టుబడి దారులకు రూ.10వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఇదంతా కూడా 'ఆర్థికమాంద్యం' పేరుతో, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే సాకుతో జరుగుతోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆర్థికమాంద్యం దెబ్బకు ఉద్యో గాలు, ఉపాధి కోల్పోయిన సగటు భారతీయుడ్ని మాత్రం మరిచిపోయారు. మాంద్యం దెబ్బ ప్రజలందిరిపైనా పడింది. వారి ఆదాయాల్ని ప్రభావితం చేసింది. యువతకు కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసింది. కాబట్టి కేంద్రం నుంచి ఊరట కలిగించే నిర్ణయాలు వెలువడుతాయని అందరూ ఎదురుచూశారు. కానీ ఆ దిశగా మోడీ సర్కార్ కనీసం ఆలోచన కూడా చేసినట్టు లేదని ఆర్థిక విశ్లేషకులు అన్నారు.
అవి ఉత్తుత్తి పన్నులా?
కార్పొరేట్లు, అత్యంత ధనికులపై పెద్ద ఎత్తున పన్నులు వేస్తున్నామని మోడీ సర్కార్ మొదట్లో తెగ ప్రచారం చేసుకుంది. అత్యంత ధనికుల నుంచి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తున్నామని ప్రజల ముందు చెప్పుకుంది. అయితే ఎన్నికల అవసరం తీరాక, కార్పొరేట్లకు కావాల్సిన చర్యలు చేపడుతున్నారనే మాట వినిపిస్తోంది. కొత్త కంపెనీలకు, షేర్ల బైబ్యాక్, పెట్టుబడి ఆదాయంలో...పెద్ద ఎత్తున పన్ను మినహాయింపులు ఇచ్చారు. ఈ ఒక్క ఏడాదిలో మోడీ సర్కార్ ప్రకటించిన తాయిలాల విలువ సుమారుగా రూ.1.45కోట్లు. కేంద్ర ఖజానా కోల్పోతున్న ఆదాయం ఇది.
ఐదున్నర ఏండ్లలో రూ.5.76లక్షల కోట్లు
అత్యంత ధనికులకు ప్రతి ఏటా పన్ను మినహాయింపులు పెంచుతూ వెళ్తున్నారు. గత ఏడాదితో పోల్చితే పన్ను మినహాయింపులు 33శాతంమేర పెరిగాయి. మొదటి ఏడాదిలో(2014-15) రూ.65,067కోట్లు, రెండో ఏడాది రూ.76,858కోట్లు, మూడో ఏడాది రూ.86,145కోట్లు, నాలుగో ఏడాది రూ.93,643కోట్లు, ఐదో ఏడాది రూ.లక్షా 8వేల 785కోట్లు, ప్రస్తుతం...లక్షా 45వేల కోట్లు పన్ను మినహాయింపులు ఇచ్చారు. ఈ ఐదున్నర ఏండ్లలో మొత్తం రూ.5.76 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు, అత్యంత ధనికులకు పన్ను మినహాంయిపులు దక్కాయి.
- గోడౌన్లలో 713 లక్షల టన్నుల ఆహార నిల్వలున్న మనదేశంలో ఆకలితో అలమటిస్తున్నవారు 20కోట్ల మంది ఉన్నారు. వీరి ఆకలి తీర్చడానికి ప్రజా పంపిణీ వ్యవస్థను వాడుకోవచ్చు.
- విద్య, వైద్యరంగాల్లో ప్రభుత్వ వ్యయం పెరిగితే, ఆర్థిక వ్యవస్థ కొంతలో కొంత గాడిలో పడే అవకాశముందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
- ప్రత్యక్షంగా, పరోక్షంగా రియల్ ఎస్టేట్ రంగంలో బడా పెట్టుబడిదారులకు రూ.10 వేల కోట్ల విలువచేసే పన్ను మినహాయింపుల్ని మోడీ సర్కార్ ప్రకటించింది.
- బ్యాంకుల వద్ద పేరుకుపోయిన వారి మొండి బకాయిల్ని సైతం రద్దు చేస్తున్నారు. తద్వారా వారి 'రియల్ ఎస్టేట్' ప్రాజెక్టులను పూర్తిచేసుకొనే సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు.